మోదీ గోబ్యాక్..! గుంటూరులో వచ్చేనెల 6న మోదీ పర్యటనను అడ్డుకుంటామంటున్న వామపక్షాలు..!!
విజయవాడ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ఏపి పర్యటనను టీడిపి పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అదే కోవలో ఇప్పుడు వామపక్షలు చేరిపెయాయి. ప్రధాని మోదీ గుంటూరు పర్యటనను వ్యతిరేకిస్తూ 'మోదీ గో బ్యాక్' నినాదంతో రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీల కూటమి నిర్ణయించింది. విజయవాడ దాసరి భవన్లో 10 వామపక్ష పార్టీల ప్రతినిధులు ఆర్ఎస్పీ నేత జానకిరాములు అధ్యక్షతన సమావేశమయ్యారు. జనవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
జనవరి 6వ తేదీన గుంటూరులో 'మోడీ గో బ్యాక్' నినాదంతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించాలని నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 8, 9 తేదీల్లో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది. కరవు సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కరవు మండలాల్లో ఈ నెల 28న జరిగే 'కరవు రైతుల బంద్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరింది.