సీబీఐ ఇష్యూ, మోడీ అంతా చెడగొడుతున్నారు: మన్మోహన్ను లాగి బాబు ఫైర్, టిక్కెట్లపై తేల్చేశారు!
అమరావతి: నాలుగేళ్లలో దేశంలోని వ్యవస్థలను భారతీయ జనతా పార్టీ కుప్పకూల్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీబీఐ పరిణానాలు, ఐటీ దాడులపై మాట్లాడారు. సీబీఐ సహా అన్ని సంస్థలు గందరగోళంలో ఉన్నాయని మండిపడ్డారు.
ఆదాయపన్ను శాఖ దాడులతో భయోత్పాతం సృష్టించి బీజేపీ పబ్బం గపడాలని చూస్తోందని విమర్శించారు. దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకం కావాలన్నారు. ఏపీలో టీడీపీ సభ్యత్వం కోటికి చేరుకోవాలన్నారు. శక్తిసామర్థ్యాలను బట్టి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు.
సుప్రీంకోర్టుకు సీబీఐ వివాదం, నాగేశ్వరరావు నియామకం పైనా: జేపీ, లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?
సంస్థలు నిర్వీర్యం
మంగళవారం కూడా చంద్రబాబు సీబీఐ ఇష్యూపై మోడీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. సీబీఐ వంటి స్వతంత్ర సంస్థను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ కూడా కూలిపోందన్నారు. పలు సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయన్నారు.
దేవేగౌడ నుంచి మన్మోహన్ సింగ్ వరకు కూడా సమస్యల్లేవు
ఐటీ సోదాలపై మాట్లాడుతూ.. మైనార్టీ ప్రభుత్వాలు, మిత్రపక్షాలతో కలిసి నడిచిన గత ప్రభుత్వాల హయాంలో కూడా ఇలా జరగలేదని చంద్రబాబు అన్నారు. దేవేగౌడ, గుజ్రాల్, వాజపేయి, పీవీ నర్సింహా రావు, మన్మోహన్ సింగ్ల హయాంలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తలేదని చెప్పారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గుంటూరు వరకు వచ్చి టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించలేదన్నారు.
మనం ఇలా.. బీజేపీ అన్నింటినీ నాశనం చేసింది
రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వం ప్రస్తుతం 64 లక్షలుగా ఉందనీ, ఇది కోటికి చేరుకునేలా కృషి చేయాలని చంద్రబాబు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 31 నుంచి అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అన్నారు. గత నాలుగేళ్లుగా ఎలాంటి సమస్యలు వచ్చినా పట్టుదలతో అధిగమించామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో టిట్లీ తుపాను పెను విధ్వంసం సృష్టించినా కేవలం 11 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చామన్నారు. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం అప్పగిస్తే అన్ని వ్యవస్థలను బీజేపీ నాశనం చేసిందన్నారు.
గెలిచే వారికే టిక్కెట్లు, మిగతా వారికి ప్రత్యామ్నాయ బాధ్యతలు
ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం గెలుపొందేలా అందరూ పని చేయాలని చంద్రబాబు సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామన్నారు. మిగతా నేతలకు ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగిస్తామని తేల్చి చెప్పారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.
చంద్రబాబుపై కన్నా నిప్పులు
పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్లను కాదని జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇచ్చి పంచాయతీరాజ్ చట్టాన్ని చంద్రబాబు అపహాస్యం చేశారన్నారు. ప్రభుత్వం పనితీరుపై చంకలు గుద్దుకుంటున్న చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. సాగునీటి టెండర్లు లోకేష్కు కలెక్షన్ కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. కుప్పం నియోజకవర్గంలో క్రికెట్ కిట్ల పంపిణీలో అవినీతి జరిగిందన్నారు. ఓ వైపు కేంద్రం సాయం చేయడం లేదని టీడీపీ నేతలు చెబుతుంటే మరోవైపు ఉపాధి హామీ నిధులు దేశంలోనే అత్యధికంగా ఏఫీకి వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారని గుర్తు చేశారు. కేంద్రం సాయం ఎలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.