ఎన్నికల ఏడాది జాగ్రత్త! బీజేపీకి వ్యతిరేకం కాదు, మోడీ ఫేవరే: కేసీఆర్పై మళ్లీ చంద్రబాబు
అమరావతి: తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనంతరం చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యలపై కోర్టుకెళ్తామన్న తన వ్యాఖ్యలను బీజేపీకి వ్యతిరేకంగా భావించకూడదని ఆయన స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టుకైనా వెళ్తాం: చంద్రబాబు, కేసీఆర్, నీతి ఆయోగ్ వైస్ఛైర్మన్ వ్యాఖ్యలపై ఆవేదన
శనివారం నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. హామీల సాధన కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనుకోవటం మనకున్న హక్కు.. దీనిని కొందరు బీజేపీపై పోరాటంగా చిత్రీకరించడం తగదని అన్నారు.
మోడీ గతం కంటే..
ప్రధానమంత్రిని కలిశాక హామీల అమలుపై స్పష్టత కనిపించిందని చంద్రబాబు చెప్పారు. పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయని, సమస్యలు పరిష్కారం అయ్యే వాతావరణం ప్రధానితో భేటీ అనంతరం తనకు కలిగిందని వెల్లడించారు. గతంలో కంటే ఇప్పుడు ప్రధాని మోడీ తమకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు.
పునర్విభజనకు సానుకూలత..
నియోజకవర్గాల పునర్విభజనపై కూడా కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయని తెలిపారు. కాగా, కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ టీడీపీ, జన్మభూమి కార్యక్రమం సరిగా జరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలంటూ కొందరు నేతలకు ఆయన ఈ సందర్భంగా సూచించారు.
ఎన్నికల ఏడాది జాగ్రత్త..
ఎన్నికల ఏడాది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పార్లమెంటరీ ఇంఛార్జీ మంత్రులు మరింత కష్టపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నాలుగేళ్ల కష్టంతో ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. ఇందుకు జన్మభూమిలో ఎలాంటి గొడవలు లేకపోవడం నిదర్శమని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు సానుకూలంగా ఉన్నారని మంత్రి యనమల కూడా ఈ సందర్భంగా చెప్పారు.
కేసీఆర్పై మరోసాబు బాబు
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను ఈ సమావేశంలో మరోసారి ప్రస్తావించారు చంద్రబాబు. హైదరాబాద్ను ధ్వంసం చేశామనే రీతిలో కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి మనమే అన్న విషయం అందరికీ తెలిసిందేనని చంద్రబాబు అన్నారు.
కోడి పందాలపై బాబు క్లాస్
ఈ సమావేశంలో కోడి పందాలపై చంద్రబాబు నేతలకు క్లాస్ పీకారు. కోడి పందాలు సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తే తప్పులేదని, అయితే, తామే పందాలు నిర్వహిస్తామంటే మాత్రం సరికాదని తేల్చి చెప్పారు.
ఇతర పార్టీల నేతలను ఇలా చేర్చుకోండి
ఈ సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో పలువురు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన చంద్రబాబు.. స్థానికంగా ఎలాంటి సమస్య లేకుండా కొత్తవారిని పార్టీలోకి తీసుకోవచ్చని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.