రాజకీయాల్లో మోడీ నా జూనియర్..అయినా సర్ అని పిలిచాను ఎందుకంటే: చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీల మధ్య దూరం చాలా పెరుగుతోంది. ఇప్పటికే పలు వేదికలపై మోడీ లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ పై బాబు మరో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి వేదికగా మోడీ బీజేపీ పై చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు.
ఏపీ పై మోడీ సర్కార్ మొసలి కన్నీరు కారుస్తోంది
ప్రత్యేక హోదా సాధాన కోసం తాను చేయాల్సిందంతా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం అఖిలపక్ష పార్టీల నేతలకు కూడా ఆహ్వానం పంపామని వెల్లడించారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందన్న చంద్రబాబు బీజేపీ అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేస్తుందని భావించినట్లు చెప్పుకొచ్చారు. కానీ కేంద్ర సర్కార్ ఏపీపై మొసలికన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. అంతేకాదు 2014లో బీజేపీ టీడీపీలు కలిసి వెళ్లాయని గుర్తుచేసిన చంద్రబాబు... అది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు. బీజేపీతో పొత్తు లేకుంటే మరో 10 సీట్లు టీడీపీ అదనంగా గెలిచేదని చెప్పుకొచ్చారు.
బిల్ క్లింటన్ను కూడా సర్ అని పిలవలేదు..అలాంటిది మోడీని పిలిచాను
నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ను కలిసిన సమయంలో ఆయన్ను సర్ అని కాకుండా మిస్టర్ క్లింటన్ అని సంబోధించానని చెప్పిన చంద్రబాబు... రాజకీయాల్లో మోడీ తనకు జూనియర్ అని గుర్తుచేశారు. కాని ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టగానే ఆయన్ను 10 సార్లు సర్ అని సంబోధించానని చంద్రబాబు చెప్పారు. ఇలా పదే పదే ఆయన్ను సర్ అని పిలవాల్సిన అవసరం తనకు లేదని.. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన్ను సర్ అని సంబోధించాల్సి వచ్చిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశతోనే తన స్థాయిని తగ్గించుకుని మోడీని సర్ అని పిలిచానని చెప్పుకొచ్చారు బాబు. అంతేకాదు అలా పిలిస్తే మోడీ ఇగో దెబ్బతినదని చెప్పారు చంద్రబాబు.
గోద్రా ఘటనలో మోడీని రాజీనామా చేయమని చెప్పాను.. అందుకే ఇలా
ప్రధాని నరేంద్ర మోడీ తమకు న్యాయం చేయలేరని భావించిన తర్వాతే ఎన్డీఏ నుంచి గతేడాది బయటకు రావడం జరిగిందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మీనవేషాలు లెక్కవేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. నాడు గుజరాత్లో గోద్రా అల్లర్లు జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నారని గుర్తు చేసిన చంద్రబాబు... అతన్ని సీఎంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిని తనే అని బాబు చెప్పారు. అందుకే మోడీ తనపై కక్ష గట్టి ఉంటారని, అందుకే ప్రధానిగా ఏపీకి న్యాయం చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు
కేసీఆర్తో మోడీ లాలూచీ పడ్డారు.. అందుకే ఆయనపై కేసులు ఎత్తివేశారు
ఇక ప్రధాని మోడీ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై సీబీఐ, ఈడీ, ఇతర స్వతంత్రహోదా కలిగిన సంస్థలతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అంతేకాదు తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీతో లాలూచీ పడ్డారని అందుకే ఆయనపై ఉన్న కేసును కొట్టివేయడం జరిగిందని బాబు వెల్లడించారు. వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదని బాబు తెలిపారు. కలిసి కేంద్రం పై ఒత్తిడి తీసుకొద్దాం అని అఖిలపక్షాలకు చెప్పినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు.
ఇక ప్రత్యేక హోదా కోసం ఎవరైతే పోరాడి వారిపై కేసులు నమోదయ్యాయో ... వారిపై కేసులను ఉపసంహరించే దిశగా చర్యలు తీసుకుంటామని బాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు గురవారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమైన పార్టీలు హాజరు కాలేదు. ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేనందువల్లే తాము హాజరుకావడం లేదని ఆరోపించాయి. ఎస్పీ, బీఎస్పీ పార్టీలు మాత్రమే అఖిలపక్ష భేటీకి హాజరయ్యాయి.