మోదీ ది నెగటివ్ క్యారెక్టర్, ప్రధాని అభ్యర్ధిగా ఎవర్నీ నిర్ణయించలేదు
ప్రధాని మోదీ పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీవి నినాదాలే మినహా..అభివృద్ది ఎక్కడా లేదని ఆరోపించారు. ప్రధాని ది పూర్తిగా నెగటివ్ క్యారెక్టర అని దుయ్యబట్టారు. మోదీ హయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపత్తిని కోల్పోయి..ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఎన్నికల తరువాతే ప్రధాని ఎవరనే దాని పై నిర్ణయానికి వస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.
ప్రధాని గా ఎవరినీ నిర్ణయించలేదు..
తాము భాగస్వామ్యం వహిస్తున్న భాజపా వ్యతిరేక ఫ్రంట్లో ప్రధాని అభ్యర్థిగా ఎవర్నీ నిర్ణయించలేదని, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా మేం సమర్థించలేదని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. ఎన్ని కల తర్వాతే ప్రధాని ఎవరనేదానిపై నిర్ణయానికి వస్తామని చెప్పారు. విశాఖలో నిర్వహించిన ‘ఇండియా టుడే' సదస్సులో ఆయన ప్రసంగించారు. భాజపా, కాంగ్రెస్ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. జాతీయ స్థాయి ప్రయోజనాల కోసమే భాజపా వ్యతిరేక ఫ్రంట్కు శ్రీకారం చుట్టామని చంద్రబాబు వివరించారు. అందులో భాగంగానే తెలంగాణలో మహాకూటమిగా పోటీచేశామన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల్లో మోదీపై వ్యతిరేకత కనిపించిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటూ మోదీ తమపై దాడి చేస్తున్నారన్నారు. సీబీఐ కంటే ఏసీబీ బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. సీబీఐ పనితీరు బాగాలేనందునే రాష్ట్రంలోకి అనుమతించ వద్దని నిర్ణయించినట్లు చెప్పారు.
మా ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసారు..
చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించారు. తమ ఫోన్లను సైతం ట్యాపింగ్ చేస్తూ గోప్యతకు భంగం కలిగిస్తున్నా రని విమర్శించారు. హైదరాబాద్లో తాను చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోయారని..వారు మరిచిపోయినా తాను చేసిన పని చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఏపీలో గెలిచి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పీవీ నరసింహారావు మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపినా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నా మార్పులు తీసుకురాలేకపోయారని ఎద్దేవాచేశారు. నోట్ల రద్దును తాను సమర్థించిన విషయం నిజమే కానీ..రూ.500, రూ.2వేల నోట్లను వ్యతిరేకించాని చెప్పారు. డిజిటల్ కరెన్సీ పెంపు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించానని అన్నారు. మోదీ నినాదాలు ఇచ్చారే తప్ప దేశానికి చేసిందేమీ లేదని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.
మోదీ ది నెగటివ్ క్యారెక్టర్...నేనే సీనియర్ని..
ప్రధాని మోదీది నెగటివ్ క్యారెక్టర్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. బలమైన వ్యక్తిగా ప్రధాని సీటు దక్కించకున్న మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవస్థలను ఒక దాని తరువాత మరొకటి విచ్చిన్నం చేసారని ఆరోపించారు. ప్రధాని మోదీ కంటే తాను ముందే ముఖ్యమంత్రి అయ్యానని గుర్తు చేసారు. ఏపిలో అన్నింటా తాము నెంబర్ ఒన్ ఆ ఉన్నామని..జగన్ యాత్ర వలన తమకు ఎటువంటి నష్టం లేదని తేల్చి చెప్పారు. ఏపిలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. రాయలసీమ ను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదని..మూడు రీజియన్లను అభివృద్ది చేస్తు న్నామని చంద్రబాబు వివరించారు. ప్రధాని మోదీని ఓడించటమే లక్ష్యంగా కాంగ్రెస్ తో జత కట్టామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.