జగన్ను ఆకాశానికి ఎత్తిన మోడీ, ఏపీకి సహకారం ఉంటుందని హామీ
Modi offered another opportunity to serve the people of the country. happy to come to Tirupathi soon after taking charge second time. He said that Venkanna Swamy wanted to fulfill the aspirations of 1
తిరుపతి : 'బాలాజీ పాదపద్మాల సాక్షిగా నాకు మరోసారి అధికారం అప్పగించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు, స్వామికి నా ప్రణామాలు' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి ప్రజా ధన్యవాద సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. రెండోసారి ప్రధాని పదవీ అధిష్టించిన తర్వాత తొలిసారి తిరుపతి వచ్చారు మోడీ. ఈ సందర్భంగా తిరుపతిలో బీజేపీ నేతలు ప్రజా ధన్యవాద సభను ఏర్పాటుచేశారు. వేదికపైనుంచి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు మోడీ.
స్వామికి ప్రణామాలు ..
మరోసారి అధికారం కట్టబెట్టిన బాలాజీ స్వామికి ప్రణామాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు మోదీ. వెంకన్న దర్శనం కోసం వస్తే .. తనకు ప్రజల దర్శనం జరిగిందని శ్రేణులను ఉత్తేజపరిచారు మోడీ. దేశ ప్రజలకు సేవ చేసే మరో అవకాశం ఇచ్చిందని .. ఏడాదిపాటు కష్టపడి ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని హామీనిచ్చారు. రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే తిరుపతి రావడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోడీ. 130 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని వెంకన్న స్వామిని కోరతానని పేర్కొన్నారు. అంతేకాదు ఎన్డీఏ రెండోసారి అధికారం చేపట్టాక .. రెండు విశిష్టతలు ఉన్నాయని తెలిపారు. ఒకటి ఈ ఏడాది గాంధీ 150 జయంతి అని .. రెండోది 2022లో మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లవుతుందని పేర్కొన్నారు.
షాక్ నుంచి తెరుకోలేదు ..
ఎన్నికల ఫలితాల నుంచి కొందరు ఇంకా కోలుకోలేదని ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. ఏపీలో వైసీపీ ప్రభంజన .. కేంద్రంలో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీ అధికారం కోల్పోవడంతో .. ఈ మేరకు మోడీ చేసిన పరోక్ష వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ నాయకత్వంలో ఏపీలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని మోడీ గుర్తుచేశారు. ఏపీలో వైసీపీ 150కి పైగా అసెంబ్లీ సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సుపరిపాలన అందిచాలని జగన్ను కోరుతున్నానని తెలిపారు మోడీ. ఏపీ ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు మోడీ. ఏపీకి అన్నివిధాలా సంపూర్ణ సహకారం అందిస్తామని ఉద్ఘాటించారు. అంతేకాదు నవ్యాంధ్ర అన్నిరంగాల్లో దూసుకెళ్తుందని కొనియాడారు.
మోడీ ధీమా ..
మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేని స్థితి నుంచి ఈ స్థాయికి బీజేపీ చేరుకుందని గుర్తుచేశారు. భవిష్యత్తులో తమిళనాడు, ఏపీలో బీజేపీ అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో దక్షిణాదిలో బీజేపీ విస్తరణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా తమ పార్టీ క్రమంగా పుంజుకుంటుందని వివరించారు. గత లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకోవడమే ఇందుకు ఉదహరణ అని తెలిపారు.
మోడీకి ఘనంగా సన్మానం ..
ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ... తొలిసారి తిరుపతి వచ్చిన మోడీని బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు. తలపాగా పెట్టి, గజమాల వేసి .. శాలువాతో సన్మానించారు. కార్యకర్తలను శ్రేణులను ఉత్తేజపరిచారు. ఎన్నికలు గెలువడం కాదు.. ప్రజల మనస్సులను కూడా గెలవాల్సి ఉందన్నారు. ఇందుకోసం మనమంతా 365 రోజులు పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజా ధన్యవాద సభ తర్వాత శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు మోడీ. మోడీతోపాటు గవర్నర్ నరసింహన్, సీఎం జగన్, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.