జగన్ సీఎం అయ్యాక తొలిసారి తిరుమలకు ప్రధాని.. ఏపీకి వరాల మూట ఇచ్చేనా?
తిరుమల : ప్రధాని నరేంద్రమోడీ సాయంత్రం తిరుమలకు రానున్నారు. వైసీపీ చీఫ్ జగన్ ఏపీ సీఎం పగ్గాలు చేపట్టాక, రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద్రమోడీ తిరుమలకు రావడం ఇదే తొలిసారి. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వంతో పాటు బీజేపీ కార్యకర్తలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేణిగుంటలో కార్యకర్తలతో సమావేశమైన అనంతరం మోడీ.. తిరుమలకు చేరుకోనున్నారు. ప్రధాని తిరుమల పర్యటన నేపథ్యంలో ఆయన ఏపీకి ఎలాంటి వరాలు ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వైఎస్ను గుర్తు చేసిన జగన్ కేబినెట్... ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చాడంటే..!
బీజేపీ కార్యకర్తలతో సమావేశం
ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు శ్రీలంకలోని కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని మోడీ తిరుమలకు బయలుదేరనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, 4.40గంటలకు ఎయిర్పోర్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోడీ పాల్గొంటారు. ఈ బహిరంగ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు అరగంట పాటు కార్యకర్తలతో గడిపిన అనంతరం మోడీ సాయంత్రం 5.10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం ఆరింటికి తిరుమలకు చేరుకోనున్నారు.
స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం
తిరుమలలో ప్రధాని నరేంద్రమోడీకి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం మోడికి స్వాగతం పలికనున్న అర్చకులు మహాద్వారం గుండా శ్రీవారిని దర్శనం కల్పించనున్నారు.
మోడీతో జగన్ భేటీ
తిరుమలకు రానున్న ప్రధాని మోడీతో సీఎం జగన్ గెస్ట్ హౌస్లో భేటీ కానున్నారు.ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే... వైఎస్ జగన్... ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారు. ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. తాజాగా ప్రధాని పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ఆయన మరోసారి లేవనెత్తనున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం వరుస సమీక్షలతో రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఆయనకు ఓ క్లారిటీ వచ్చింది. జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని, తక్షణ సాయంగా అవసరమైన నిధులు అందజేయాలని జగన్ ప్రధాని మోడీని కోరనున్నట్లు తెలుస్తోంది.
మోడీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి
ఇదిలా ఉంటే రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఏపీలో అడుగుపెడుతున్న నరేంద్రమోడీ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో ఆయన ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటన చేస్తారా లేక జగన్తో భేటీ అనంతరం స్పష్టతనిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది.
రాత్రికి తిరుగుపయనం
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రధాని మోడీ రాత్రి 7.20గంటలకు రోడ్డు మార్గంలో రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. 8.10గంటలకు స్పెషల్ ఫ్లైట్లో ఆయన ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. మోడీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. గతంలో 2015 అక్టోబర్ 3న, 2017 జనవరి 3న ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.