జెపికి లేదు: నరేంద్ర మోడీ మద్దతు టిడిపి మల్లారెడ్డికే
హైదరాబాద్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మద్దతు మల్కాజిగిరి లోకసభ స్థానంలో లోకసత్తా అభ్యర్థి జయప్రకాష్ నారాయణకు మద్దతు లభించే అవకాశం లేదు. జయప్రకాష్ నారాయణ మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో మోడీని కలిశారు. తన మద్దతు మోడీకి ఉంటుందని ఆయన అన్నారు. మల్కాజిగిరిలో జెపి తెలుగుదేశం, బిజెపిల మద్దతు ఆశించారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థిగా సిహెచ్ మల్లారెడ్డిని నిలిపారు.
మల్లారెడ్డి చేత నామినేషన్ను ఉపసంహరింపజేయడానికి జెపి తీవ్రంగానే ప్రయత్నించారు. బిజెపి జాతీయ నేతల నుంచి కూడా జెపి చంద్రబాబుపై ఒత్తిడి చేయించారు. కానీ ఫలితం కనిపించలేదు. బిజెపి అయినా మద్దతు ఇస్తుందనే ఆశతో జెపి వ్యవహరించినట్లు కనిపించారు.
అయితే, నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా బిజెపి మద్దతు స్పష్టంగా మల్లారెడ్డికే ఉన్నట్లు స్పష్టమైంది. హైదరాబాద్లో జరిగిన మోడీ సభలో సిహెచ్. మల్లారెడ్డి పాల్గొన్నారు. జయప్రకాష్ నారాయణకు చోటు దక్కలేదు. మోడీ మల్లారెడ్డి పేరును ప్రస్తావించారు కూడా. దీన్ని బట్టి జెపికి మల్కాజిగిరిలో బిజెపి మద్దతు ఇవ్వడం లేదనేది స్పష్టమైంది.
కాగా, మల్కాజిగిరిలో జయప్రకాష్ నారాయణకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం సాగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణంలో పవన్ కళ్యాణ్ ప్రచారం సాగిస్తాడా, లేదా అనేది కూడా చూడాల్సిందే.