రాయపాటికి చెక్: నర్సారావుపేటకే మోదుగుల పట్టు
తాను నర్సారావుపేట లోకసభ స్థానం నుంచే పోటీ చేస్తానని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సోమవారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి చెప్పుకున్నారు. శాసనసభకు పోటీ చేయాలని చంద్రబాబు మోదుగలకు సూచించినట్లు సమాచారం. గుంటూరు 1 లేదా బాపట్ల నుంచి శాసనసభకు పోటీ చేయాలని చంద్రబాబు ఆయనతో అన్నట్లు తెలుస్తోంది. అయితే, అందుకు మోదుగుల సిద్ధపడడం లేదని తెలుస్తోంది.
చంద్రబాబుతో భేటీ తర్వాత మోదుగుల మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం నా శక్తివంచన లేకుండా పోరాటం చేశానని, తన పోరాటంపై ప్రజల్లో సానుభూతి ఉందని, ఈసారీ నేను నరసరావుపేట నుంచే పోటీ చేయాలనుకొంటున్నానని ఆయన అన్నారు. అలా చేస్తే నేను లక్ష మెజారిటీతో గెలుస్తానని, ఇవే విషయాలను అధినేతకు వివరించానని, చంద్రబాబు తన పట్ల సానుకూలంగా ఉన్నారని ఆయన అన్నారు.
'నరసరావుపేటలో మీ బావ అయోధ్య రామిరెడ్డిపై మీరు పోటీ చేస్తారా' అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే - తాను సిటింగ్ ఎంపీనని, తన బావే అక్కడకు వచ్చి తనపై పోటీ చేస్తున్నారని సమాధానం ఇచ్చారు. ఒకే కుటుం బం నుంచి పోటీ చేస్తే ఇబ్బంది కాదా అనే ప్రశ్నకు ఆ యన తీవ్రంగా స్పందించారు. "నేను పార్టీకి విధేయుడిని. నా అంకిత భావాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఎన్నిసార్లు నాకు శీల పరీక్ష చేస్తారు?'' అని ప్రశ్నించారు.
తన బావ నరసరావుపేటలో పోటీ చేయడం తన తప్పు ఎలా అవుతుందని ఆయన అడిగారు. అయోధ్య రామిరెడ్డి తనకు బావే అయినా తమవి వేర్వేరు కుటుంబాలని ఆయన అన్నారు. చంద్రబాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఒప్పించాడనికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది.