సీనియర్లకు బాబు షాక్: తమ్ముళ్లు భగ్గు, ఆఫీస్పై దాడి
విజయవాడ/గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రి పదవుల చిచ్చు రాజుకుంది. పలువురు సీనియర్లకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీని పైన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కోడెల శివప్రసాద్, దూళిపాళ్ల నరేంద్ర, కళా వెంకట్రావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తిలకు చోటు దక్కలేదు.
దూళిపాళ్లకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కపోవడం పైన ఆయన వర్గం తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. దూళిపాళ్లకు మద్దతుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దూళిపాళ్ల ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా చింతలపూడిలో అడ్డుకున్నారు. మీకు కేబినెట్లో చోటు దక్కలేదని, మీరు ప్రమాణానికి వెళ్లవద్దని ఆయన వర్గం ఆయనను డిమాండ్ చేసింది. ఆయనను చింతలపూడిలో గృహనిర్బంధం చేశారు.
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా అసంతృప్తికి లోనయ్యారు. తాను ఎంపీగా పోటీ చేస్తానంటే... ఎమ్మెల్యేగా పోటీ చేయించి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకోవడం లేదని మోదుగుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే విస్తరణలో తమకు చోటు దక్కుతుందని దూళిపాళ్ల, మోదుగులలు తమ వర్గం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మోదుగులకు కేబినెట్లో చోటు దక్కక పోవడంపై ఆయన వర్గం అగ్గిమీద గుగ్గిలం అయింది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కార్యాలయం పైన దాడికి దిగారు. ఎన్నికల సమయంలో మోదుగులకు ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. తమకు చోటు దక్కుతుందని చివరి వరకు భావించిన పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు.