మోదుగుల పట్టు, జూ. ఎన్టీఆర్ ఔట్ పవన్ ఇన్: విహెచ్
హైదరాబాద్: బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు అని, తాను నర్సారావుపేట బరిలో దిగి తాడోపేడో తేల్చుకుంటానని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మంగళవారం చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుండి నర్సారావు పేట టిక్కెట్ తనదే అన్నారు. సిట్టింగ్ ఎంపీని అయిన తనను కాదని కొత్త వారికి ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు.
కాగా, నర్సారావు పేట నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున అయోధ్య రామిరెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన మోదుగులకు బావ. బావ పైన పోటీ చేసేందుకు మోదుగుల ఆసక్తి చూపించడం లేదని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు రాయపాటి టిడిపిలో చేరారు. ఆయనకు నర్సారావు పేట టిక్కెట్ ఇస్తారని తెలియడంతో దీనిపై మోదుగుల స్పందించారు. తానే పోటీ చేస్తానని, బంధుత్వానికి రాజకీయానికి సంబంధం లేదన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ వెళ్లనందునే పవన్ కళ్యాణ్: విహెచ్
జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నుండి బయటకు వెళ్లనందునే తెలుగుదేశం పార్టీ తమ పార్టీ సీనియర్ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సోదరుడు అయిన పవన్ కళ్యాణ్ను తెరపైకి తెచ్చారని కాంగ్రెసు రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఆరోపించారు. జై సమైక్యాంధ్ర అధినేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యమని ఇంకా సీమాంధ్ర ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.
విభజన విషయంలో అన్ని పార్టీలు మాట మార్చాయన్నారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు బిసిలను ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలన్నారు. దళితుడే ముఖ్యమంత్రి అన్న తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ తర్వాత మాట మార్చారన్నారు. పవన్ జనసేన వెనుక చంద్రబాబు ఉన్నారని విహెచ్ ఆరోపించారు.
ఎన్నికల్లో టిడిపి తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయనని చెప్పటంతోనే పవన్ కల్యాణ్ను బాబు తెర మీదకు తెచ్చారన్నారు. పవన్ ఇమేజ్ను చంద్రబాబు వాడుకోవాలని చూస్తున్నారన్పనారు. పవన్ సినిమా డైలాగులతోనే కాంగ్రెస్ భూస్థాపితం కాదన్నారు.