చంద్రబాబుకు మరో షాక్: గుంటూరు ఎమ్మెల్యే అసంతృప్తి, జగన్ను కలిసే ఛాన్స్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, రవీంద్రకుమార్ తదితదరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, మరో కీలక నేత పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారుతారని తాజాగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
పార్టీలోని అంతర్గత విభేదాలపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీని వీడాలని భావిస్తున్నారట. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పార్టీని వీడిన ఆమంచి కృష్ణ మోహన్ వంటి నేతల వ్యాఖ్యలను కూడా సమర్థించారని తెలుస్తోంది.
వేణుగోపాల్ రెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు. 2014లో వైసీపీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డిపై టీడీపీ నుంచి పోటీ చేసిన వేణుగోపాల్ రెడ్డి 17వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.