స్నేహానికి అర్దం తెలియని వ్యక్తి చంద్రబాబు: మనసు గాయపరిచారు: మోహన్ బాబు ఫైర్..!
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు. ఆయన తన వ్యాఖ్యలతో తన మనసు గాయపరిచారంటూ ట్వీట్ చేసారు. తనకు క్రమశిక్షణ లేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని..అది తనకు బాధ కలిగించిందని వివరిస్తూనే..చంద్రబాబు గురించి విమర్శలు చేసారు. అదే సమయంలో సూచనలు చేసారు. తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసారు.
మంగళగిరిలో లోకేశ్ కు వ్యతిరేకంగా అక్కడ ఆర్కేను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయంలోనూ టీడీపీ మీద విమర్శలు చేసారు. ఇక, ఎన్నికలు ముగిసిన తరువాత ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో కీలక పోస్టు ఇస్తారని అందరూ అంచనా వేసారు. అయితే, తనకు జగన్ ముఖ్యమంత్రి కావాలనేదే కోరిక అని..అది చాలంటూ మోహన్ బాబు తరువాత సమాధానం ఇచ్చారు. అప్పటి నుండి రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడ లేదు. సడన్ గా తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబును ఉద్దేశిస్తూ మోహన్ బాబు పోస్టింగ్ పెట్టారు.
మనసు గాయపరిచారు..
చంద్రబాబు తన మనసు గాయపరిచారంటూ ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలైపోయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారని, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారని, అంతా ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో మళ్ళీ ఇలా తన మనసును ఇబ్బంది పెడతావనుకోలేదని ట్వీట్ చేశారు. క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్బాబు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని తన ట్వీట్ లోపేర్కొన్నారు.
చంద్రబాబు గాయపరిచారని
తన మనసును చంద్రబాబు గాయపరిచారని, ఎన్టీఆర్, అక్కినేని లాంటి సినీ పెద్దలు, సినీ పరిశ్రమ తన క్రమశిక్షణ గురించి ఎన్నో సార్లు కొనియాడారని.. అది అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దయ చేసి ఏ సందర్భంలోనూ తన పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించొద్దని విజ్ఞప్తి చేశారు. అది ఇరువురికి మంచిదేనని.. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందామని.. అదీ ఇష్టమైతేనే అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
చంద్రబాబు పైన ఈ రకమైన కామెంట్లు
ఇప్పుడు మోహన్ బాబు చేసిన ట్వీట్ ఇటు రాజకీయంగానూ..అటు సినిమా ఇండస్ట్రీలోనూ సంచలనం గా మారింది .ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మోహమాటం లేకుండా మాట్లాడే మోహన్ బాబు ఇప్పుడు..చంద్రబాబు పైన ఈ రకమైన కామెంట్లు చేయటంతో..వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. గతంలో ఎన్నికల సమయంలోనూ మోహన్ బాబు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయటం పైనా చంద్రబాబు విమర్శలు చేసారు. ఇప్పుడు మరి ఆయన స్పందిస్తారో లేదో అన్నది ఆసక్తి కరంగా మారింది.