మోహన్ బాబువి పచ్చి అబద్దాలు..! బోదన రుసుము చెల్లింపులపై టీడిపి వివరణ..!!
అమరావతి/హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్పై సినీ నటుడు మోహన్బాబు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ మోహన్బాబు నిరసనకు దిగడంపై కుటుంబరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పవన్ అనుభవం ఎంత : మీరు భయపడతారు..నేను కాదు: చంద్రబాబు ఫైర్..!
ప్రతిపక్షానికి ఆయన వంతపాడుతున్నారని కుటుంబరావు ఆరోపించారు. కక్ష పూరితంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఐదేళ్లలో 14,510 కోట్ల రూపాయలను ఫీజురీయింబర్స్మెంట్ ఇచ్చామని చెప్పారు. వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోహన్బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఆయన ఏ రోజైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా ఉదయం నుండి తిరుపతిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆలస్యం చేస్తోందని నిరసిస్తూ ఆయన ర్యాలీ నిర్వహించ తలపెట్టడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ర్యాలీకి అనుమతివ్వలేమని పోలీసులు స్పష్టంచేశారు.
శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి 9 కోట్ల రూపాయలను ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని మోహన్ బాబు ఆరోపించారు. ఐతే మోహన్ బాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి సమస్యలు స్రుష్టించేందుకే అలా ప్రవర్తిస్తున్నారవని టీడిపి నేతలు మండిపడుతున్నారు,