బాసరలో బడి, కెసిఆర్తో మాట్లాడ్తా: మోహన్ బాబు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో పాఠశాల పెట్టాలని ఉందని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తన కోరికను వెల్లడించారు. బాసర సరస్వతీ అమ్మవారి చెంత పాఠశాల ఏర్పాటు చేయాలని ఉందని, దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో చర్చిస్తానని ఆయన చెప్పారు.
బాసర ఆలయంతో తనకు పాతికేళ్ల అనుబంధం ఉందని, కుటుంబ సమేతంగా తరుచూ అమ్మవారి దర్శనానికి వస్తుంటానని ఆయన చెప్పారు. తన మనవరాళ్లు (హీరో మంచు విష్ణు కూతుళ్లు) అరియానా, వివియానాలకు అక్షరాభ్యాసం చేయించేందుకు మోహన్ బాబు, భార్య నిర్మలాదేవి, విష్ణు, కోడలు వెరోనికా శుక్రవారం బాసర సరస్వతీ ఆలయానికి వచ్చారు.
ఆలయ అక్షరాభ్యాస మంటపంలో మనవరాళ్లకు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ చైర్మన్ శరత్ ఫాఠక్, ఈవో ముత్యాలరావు ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఆ తర్వాత పలువురు భక్తులు, అభిమానుల కోరిక మేరకు మోహన్ బాబు, విష్ణు వారితో కరచాలనం చేసి ఫొటోలు దిగారు.
మోహన్ బాబు కుటుంబ సభ్యులతో పాటు దైవజ్ఝశర్మ బాసరకు వచ్చారు. మంచు విష్ణుకు తన కూతుళ్లంటే ఎనలేని అభిమానం.