చంద్రబాబు ఇంటికెళ్లిన మోహన్ బాబు, ఫ్యామిలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు బుధవారం ఉదయం కలిశారు. చంద్రబాబును ఆయన నివాసంలోనే మోహన్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు కలిశారు.
తనయుడు మంచు మనోజ్ వివాహ వేడుకకు హాజరు కావాలని మోహన్ బాబు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. మనోజ్ వివాహానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు తాను కలిశానని ఈ సందర్భంగా మోహన్ బాబు విలేకరులతో తెలిపారు.
కాగా, మోహన్ బాబు గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. ఎంపీగా కూడా అయ్యారు. ఆ తర్వాత టీడీపీకి దూరమయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోహన్ బాబు తెలుగుదేశం లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒకదానిలో చేరవచ్చునని ఊహాగానాలు వినిపించాయి.
ఈ చర్చకు మోహన్ బాబు తీరు కూడా కారణమైంది. చిత్తూరులో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబును ఆకాశానికెత్తడం, ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం చేశారు. దీంతో ఆయన టీడీపీలోకి వెళ్తారా వైసీపీలోకి వెళ్తారా అనే చర్చ సాగింది. కానీ ఆయన దూరంగా ఉండటం గమనార్హం.
సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని భావించినప్పటికీ... ఆయన దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు చంద్రబాబును కలుసుకొని తనయుడి పెళ్లికి ఆహ్వానించారు.