ఆ నలుగురే 'దాసరి'ని మోయాలి.. మరెవరూ ఆయన్ను తాకవద్దు: మోహన్ బాబు
ముఖ్యంగా పార్థివ దేహం తరలింపు సందర్భంగా నలుగురు మాత్రమే ఆయన భౌతిక కాయాన్ని మోయాలని మోహన్ బాబు అక్కడున్నవారికి సూచించారు.
హైదరాబాద్: పాలకొల్లు నుంచి పార్లమెంటు దాకా.. స్టేజీ నాటకాల దగ్గరి నుంచి సిల్వర్ స్క్రీన్ ను శాసించేదాకా.. దాసరి నారాయణరావు జీవితం ఓ సుదీర్ఘ ప్రయాణం. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఎంతోమంది శిష్యులను ఆయన తీర్చిదిద్దారు.
సినీ దర్శకుడిగా ఎంతో మంది హీరోలకు దాసరి లైఫ్ ఇచ్చారు. హీరో ఎవరైనా సరే, ఆయన చేతిలో పడ్డారంటే కెరీర్కు టర్నింగ్ పాయింటే అన్న అభిప్రాయం ఉండేది. ఒసేయ్ రాములమ్మ సినిమాతో విజయశాంతి ఇమేజ్ను శిఖరాలకు చేర్చారు దాసరి. అలాగే మోహన్ బాబు లాంటి గొప్ప శిష్యులని తయారుచేసుకున్నారు.
వెక్కి వెక్కి ఏడ్చిన మోహన్ బాబు:
దాసరి మరణం నేపథ్యంలో మోహన్ బాబు సహా ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. దాసరి ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఆయన యోగక్షేమాలు చూసుకుంటూ వస్తున్న మోహన్ బాబు.. ఇక ఆయన లేరనే నిజం తెలుసుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. సినీ పరిశ్రమలో దాసరి-మోహన్ బాబుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
ఆ నలుగురే:
దాసరి అంత్యక్రియల సందర్భంగా.. మోహన్ బాబు అంతా తానై ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ముఖ్యంగా పార్థివ దేహం తరలింపు సందర్భంగా నలుగురు మాత్రమే ఆయన భౌతిక కాయాన్ని మోయాలని మోహన్ బాబు అక్కడున్నవారికి సూచించారు.
నలుగురు వ్యక్తులు దాసరి భౌతిక కాయాన్ని మోస్తారని, మరో ఇద్దరు మధ్యలో పట్టుకుని ఉంటారని, వీరు మినహా మరెవరూ దాసరిని తాకడానికి వీల్లేదని మోహన్ బాబు అక్కడున్నవారిని వారించారు.
అయితే ఆ నలుగురు వ్యక్తులు ఎవరనేది మాత్రం మోహన్ బాబు పేర్కొనకపోవడం గమనార్హం. ఆయన పార్థివ దేహాన్ని మోసినవారిలో అరుణ్ కుమార్, సి.కళ్యాణ్, ఆర్.నారాయణమూర్తి, విజయేంద్ర ప్రసాద్ ఉన్నారు.
ఇవీ మోహన్ బాబు సూచనలు:
ఇంటి నుంచి నేరుగా గుడి దగ్గరికి వెళుతున్నామని చెప్పిన మోహన్ బాబు.. అక్కడ పార్థివ దేహంపై నీళ్లు చల్లుతారని, ఆ తర్వాతే కింద పెడుతామని చెప్పారు. ఎవరూ తొందరపడవద్దని, అందరు నిదానంగా నడవాలని సూచించారు. చివరగా.. గోవిందా.. గోవిందా అంటూ పార్థివ దేహాన్ని అనుసరించారు. అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుండటంతో.. పోలీస్ బ్యాండ్ దాసరి అంతిమయాత్రలో పాల్గొంది. అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు, ప్రముఖులు పాల్గొంటున్నారు.
మొయినాబాద్ లో అంత్యక్రియలు:
బుధవారం ఉదయం 10 గంటలకు దాసరి నారాయణరావు పార్థివదేహాన్ని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తరలించారు. ప్రస్తుతం అక్కడి నుంచి అంతిమయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల సమీపంలో గల మొయినాబాద్ లోని దాసరి నారాయణరావు ఫాం హౌస్ కు పార్థివ దేహం చేరుకుంటుంది. అనంతరం దాసరి భార్య పద్మ అంత్యక్రియలు నిర్వహించిన చోటే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారు.