అంబరీష్ భార్య సుమలత ఓటమికి పనిచేస్తావా: చంద్రబాబు పై మోహన్ బాబు ఫైర్
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ నేత నటుడు మోహన్ బాబు. తెలుగింటి ఆడపడుచు దివంగత నేత అంబరీష్ భార్య సుమలత ఓటమికి చంద్రబాబు కృషి చేయడం చాలా పెద్ద పొరపాటన్నారు. చంద్రబాబు చేపట్టిన చాలా కార్యక్రమాలకు అంబరీష్ హాజరయ్యారని గుర్తు చేసిన మోహన్ బాబు ... చంద్రబాబు మాండ్యకు వెళ్లి సుమలతకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం తనను బాధించిందని ట్వీట్ ద్వారా వెల్లడించారు.
చంద్రబాబు తలపెట్టే కార్యక్రమాలకు అంబరీష్ను ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చేవారని గుర్తుచేసిన పెదరాయుడు... ఆసమయంలో తాను రికమెండ్ చేస్తేనే అంబరీష్ వచ్చేవారని చెప్పారు.అయితే చంద్రబాబు మాత్రం ఆ మేలును మరిచి అంబరీష్ భార్య ఓటమికోసం ప్రచారం చేయడం చాలా బాధాకరం అని మోహన్ బాబు అన్నారు.
కృతజ్ఞత లేకుండా చంద్రబాబు వ్యవహరించారని మోహన్బాబు ధ్వజమెత్తారు. సుమలతను ఓడించేందుకు చేయాల్సిందంతా చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు మాండ్యకు వెళ్లి సుమలతకు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేకున్నానని చెప్పిన మోహన్ బాబు ఈ విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ట్విటర్లో పేర్కొన్నారు.
To all the people of Kannada, especially Mandya people and fans... pic.twitter.com/E3jiTbjKax
— Mohan Babu M (@themohanbabu) April 17, 2019
ఇదిలా ఉంటే మాండ్యలో అంబరీష్ ఆశయాలు సజీవంగా ఉండాలంటే అక్కడి ప్రజలు సుమలతను ఆశీర్వదించాలని మోహన్ బాబు కోరారు. భారీ మెజార్టీతో సుమలతను గెలిపించాలని అన్నారు. సుమలత తెలుగు ప్రజల బిడ్డలా స్వీకరించి అక్కడి తెలుగువారు ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపాలని విజ్ఞప్తి చేశారు.