దారుణం:ఇంటర్ విద్యార్థిని పై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు...లొంగలేదని ఆన్సర్ షీట్ తారుమారు
విశాఖపట్నం:చదువు,సంస్కారం నేర్పాల్సిన గురువులే కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినులను చెరబడుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఇదే కోవలో విశాఖ జిల్లాలో ఒక కీచక ప్రిన్సిపాల్ తన కళాశాలలో చదివే విద్యార్థినే చెరబట్టేందుకు విశ్వప్రయత్నం చేశాడు. ఇంటర్ చదువుతున్న ఆ విద్యార్థినిని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా లొంగక పోయేసరికి ఆమెపై కక్ష పెంచుకున్న ఆ ప్రిన్సిపాల్ మరింత బరి తెగించాడు.
ఏకంగా ఆ బాలిక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో ఆమె వద్దకు వెళ్లి సాయంత్రంలోగా తన కోరిక తీర్చకుంటే నువ్వు ఇంటర్ పాస్ కాకుండా చేస్తానని బెదిరించాడు. అయినా ఆ విద్యార్థిని పట్టించుకోకపోయేసరికి ఏకంగా ఆమె ఆన్సర్ షీట్ నే మార్చేశాడు. అన్నింట్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసయిన ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్ బెదిరించిన రోజు రాసిన ఎగ్జామ్ లో మాత్రం 2 మార్కులే రావడంతో అనుమానం వచ్చి ఆరా తీస్తే ఆ ప్రిన్సిపల్ చేసిన దారుణం బైటపడింది.వివరాల్లోకి వెళితే...
బాధితురాలి కథనం ప్రకారం...విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ప్రభుత్వ జానియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ ఎంపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ఆ కళాశాల ప్రిన్సిపల్ కె.నాగ సత్యసాయిమూర్తి తరచూ లైంగికంగా వేధిస్తూ ఉండేవాడు. తన కోరిక తీర్చాలని, లేకుంటే నువ్వు ఇంటర్ పాస్ కాకుండా చేస్తానని...తాను ఇలా వేధిస్తున్న విషయం ఎవరితో నైనా చెబితే నీ భవిష్యత్తు నాశనం చేసేస్తానని బెదిరించేవాడు.
అయినా ఈ విద్యార్థిని ఆ కీచక ప్రిన్సిపల్ కు లొంగలేదు. ఈ క్రమంలో మార్చి నెలలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థిని గణితశాస్త్రం-2బి పరీక్ష రాస్తున్న గదిలోకి వెళ్లిన ప్రిన్సిపల్ ఈమె పక్కన వచ్చి కూర్చున్నాడు. "నీకు ఎన్నిసార్లు చెప్పినా నా కోరిక తీర్చడం లేదు...ఈ రోజు నువ్వు నా రూమ్కి రావాలి...నా కోరిక తీర్చాలి...లేకుంటే నువ్వు ఇంటర్ పాస్ కాకుండా చేస్తాను"...అని బెదిరించి వెళ్లిపోయాడు. అయినా ఈ విద్యార్థిని లెక్కచేయకుండా తనమానాన తాను పరీక్ష రాసి ఇంటికి వెళ్లి పోయింది.
తీరా ఇంటర్ ఫలితాలు రాగా అన్ని సబ్జెక్టులు మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైన ఈమె గణితం-2బిలో మాత్రం 60 మార్కులకు గాను 2 మార్కులు వచ్చిఫెయిలైంది. దీంతో అనుమానం వచ్చిన విద్యార్థిని ఇంటర్ బోర్డుకు రూ.1000 చలానా కట్టి రీ-వ్యాల్యూషన్కు దరఖాస్తు చేసుకుంది. అందులో కూడా 2 మార్కులు వచ్చినట్లు చూపించడంతో జవాబు పత్రాల వెరిఫికేషన్ కు ధరఖాస్తు చేసుకుంది. వాటిని పరిశీలించగా ప్రిన్సిపల్ చేసిన దారుణం బైటపడింది. కేవలం ఒఎంఆర్ షీటు మాత్రం ఈమెది ఉంచి లోపల జవాబుపత్రం మాత్రం 2017 సప్లిమెంటరీ పరీక్షల తేదీతో వేరే వారిది ఉంచాడు.
ప్రిన్సిపాల్ చేసిన ఆగడం తెలిసి విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తెలపడంతో వారంతా శనివారం ప్రిన్సిపల్ కె.నాగ సత్యసాయిమూర్తికు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై స్థానిక ఎస్ఐ అరుణ్కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రిన్సిపల్ వివరణకు మీడియా ప్రయత్నించగా అతడు మాట్లాడేందుకు నిరాకరించాడు.
విశాఖ తండాకు చెందిన ఈ గిరిజన విద్యార్థిని చదువు పై ఆసక్తితో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చదువుకుంటుంటే ఈ కాచక ప్రిన్సిపల్ నిర్భీతిగా ఇంతటి దారుణానికి ఒడిగట్టడం, ఆ విషయాన్ని ఆన్సర్ షీట్ తారుమారైన విషయాన్ని వాల్యుయేషన్ సమయంలోనైనా గమనించకపోవడం మన విద్యావ్యవస్థ తీరుతెన్నులకు అద్దం పడుతోందని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.