అన్నల పేరుతో...మళ్లీ మొదలైన వసూళ్ల పర్వం:వడ్డీ వ్యాపారులే టార్గెట్...మావోలే లేరంటున్న పోలీసులు
పశ్చిమ గోదావరి:పశ్చిమగోదావరి జిల్లాలో కొంతకాలం నుంచి అన్నల పేరిట కలకలం జరుగుతోంది. మావోలమంటూ ఇటీవల కొన్ని ముఠాలు వడ్డీ వ్యాపారులు, ఇతర వ్యాపారస్తుల వద్ద వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే వీటి గురించి ఎవరూ బైటకు ఫిర్యాదు చేయకపోతుండటంతో ఈ దందా గురించి బైటకు తెలియడం లేదు. ఇటీవలే కొన్ని ముఠాలు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో సుమారు 15 మంది వడ్డీ వ్యాపారులను ఇలా అన్నల పేరిట బెదిరించి రూ.లక్షల్లో డబ్బులు దండుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అడిగినంత ఇవ్వకుంటే ప్రజాకోర్టుల పేరిట శిక్షలు తప్పవని బెదిరిస్తుండటంతో గుట్టుచప్పుడు కాకుండా సొమ్ముల చెల్లింపులు జరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
హెచ్చరికలు...దందా ఇలా
మావోయిస్టుల పార్టీలపేరిట కొన్ని కరపత్రాలు ముద్రించడం, వాటిని ఎంపిక చేసుకున్న కొందరికి చేరేలా పంపిణీ చేయడం జరుగుతోంది. తమ దళాలు దట్టమైన అడవి ప్రాంతాల్లో సంచరిస్తున్నారని అడిగినంత ఇవ్వకపోతే ప్రజాకోర్టులో శిక్షలు తప్పవని వారిని భయబ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. కిరాణా స్టోర్లు, హోల్ సేల్ దుకాణాలు వద్ద నిత్యావసర సరకులు సైతం తీసుకెళ్లిపోతున్నారట.
ఈ జిల్లాలో...ఎక్కడెక్కడంటే...
ప్రస్తుతం ఈ ముఠా మొత్తం జిల్లా పరిసర ప్రాంతాల్లోనే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, దెందులూరు, పోలవరం తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నారని సమాచారం. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య తమ కార్యకలాపాలు చక్కబెట్టుకొని వెళ్తున్నారు. భీమవరం ప్రాంతాల్లో రొయ్యలు, చేపల చెరువుల యజమానులను బెదిరించి వసూళ్లు చేసుకుంటున్నారు. జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారులను ఎంచుకుని వారిని టార్గెట్ చేస్తున్నారు.
మకాం మార్చారు...అలా బెదిరింపులు
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో వీరి కార్యకలాపాలపై అనుమానం వచ్చిన వ్యాపారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఈ విధమైన బెదిరింపులపై దృష్టి సారించడంతో అక్కడ నుంచి మకాం మార్చి పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు మకాం మార్చారని తెలుస్తోంది. అయితే ఇలా బెదిరిస్తున్నావారు నిజమైన నక్సలైట్లా, లేక గతంలో కార్యకలాపాలు చేసి బహిష్కరించబడిన మాజీ నాయకులా అనేది అనుమానంగా ఉంది?...దీనికి తోడు కొంతమదంది ఏకంగా బెల్టుకు పౌచ్లు కూడా తగిలించుకుని వచ్చి ఆయుధాలు ఉన్నట్లు వ్యవహరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని జంగారెడ్డిగూడెంలో ఒక వడ్డీ వ్యాపారి తెలిపారు.
మావోలే లేరు...అంటున్న పోలీసులు
అయితే అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో మావోల కదలికలే లేవని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే జిల్లాలో అన్నలు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నది ఎవరో వ్యాపారులకు అర్థం కావడం లేదు. తమ గురించి ఎవరికైనా సమాచారం ఇస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించడంతో వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి అధికారులు ఇటువంటి వారిపై దృష్టి సారించి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. దీనిపై జిల్లా పోలీస్ అధికారులను వివరణ కోరగా బాధితులు వచ్చి తమకు ఫిర్యాదు చేస్తే తప్పని సరిగా అటువంటి వారిపై దృష్టి పెడతామని చెప్పారు. కనీసం స్థానిక పోలీస్ స్టేషన్లో అయినా బెదిరింపుల గురించి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.