అనుకున్నదొక్కటి ... అయినదొక్కటి... టీడీపీలో ఓట్ల కంటే నోట్ల పంచాయితీలు ఎక్కువైయ్యాయా?
పోలింగ్ సరళితో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే లెక్కలు తేలక టీడీపీ అధినాయకత్వం మల్ల గుల్లాలు పడుతోంది. ఇదే సమయంలో డబ్బుల లెక్కల పంచాయితీ ఇప్పుడు ఆ పార్టీలోని ముఖ్యనేతలకు తల నొప్పిగా మారింది. ఎన్నికల సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతలు తమకు డబ్బులిచ్చినట్లుగా చెబుతున్నారని..తమకు అది అందలేదని ఫిర్యాదు చేసారు. అయితే, దీని పైన వివరణ కోరగా ఓ కీలక నేత తనకే ఇంకా 32 ఓట్లు రావాలంటూ రివర్స్ సమాధానం ఇచ్చారు.దీంతో..ఇప్పుడు ఈ పంచాయితీ అమరావతి పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది.
లెక్కలు కాదు..32 కోట్లు రావాలి..
పార్టీ ఫిరాయించి కీలక పదవి అనుభవించి..తొడ కొట్టీ మరీ ఎన్నికల బరిలోకి దిగిన ఓ నేత గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. విపక్ష నేతకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో తన స్థాయిని పెంచుకోవానికి ఆయన రాయలసీమలోని ఆ కీలక జిల్లా నుండి ఎన్నికల బరిలోకి దిగారు. ఆ జిల్లాలో మొత్తం పెత్తనం తనదే అన్నట్లుగా రెండేళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన పోటీ పైన తర్జన భర్జన జరిగింది. ఎట్టకేలకు అధినేత సూచన మేరకు రాజీ ఫార్ములా కుదిరి పోటీలో నిలిచారు. ఆ సమయంలోనే అక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా భావించి భారీగా ఆయన నిధులు ఖర్చు చేసేందుకు సిద్దమ య్యారు. దీంతో..పోటీలో ఉన్న మిగతా అభ్యర్దులకు ఆయనే కామధేనువుగా పార్టీ నాయకత్వం చూపించింది. ఆ జిల్లాలో పోటీలో ఉన్న మిగిలిన వారు ఆయన వైపే ఆశగా చూసారు. ఎన్నికలు పూర్తయ్యాయి. వారంతా లబోదిబో మంటూ కరకట్ట కు పరిగెత్తారు. తమకు ఆయన డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. అసలు నేతను పిలిపించి పార్టీ ముఖ్య నేతలు విచారిస్తే ఆయన రివర్స్ అయ్యారు. తనకే ఇంకా 32 కోట్లు రావాలంటూ లెక్కలు సమర్పించారు. దీంతో..చేసేది లేక భవిష్యత్లో ఇక డబ్బులు అడగవద్దు...మంచి అవకాశం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఆయన బాధ వినేదెవరు..
2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం తెర వెనుక మంత్రాంగం నడిపారు. ఆర్దికంగానూ తోడ్పాటు అందించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పించారు. అధినేత ఏరి కోరి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక, ఈ ఎన్నికల్లో ముందు నుండి తన సొంత జిల్లా నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించారు. అధినేతను ఒప్పించారు. ఆర్దికంగా బలమైన ఆ నేత..తన ప్రత్యర్ధి అయిన వైసీపీ నుండి పోటీలో ఉన్న బలహీర వర్గాలకు చెందిన ఆ యువ నేతను ఓడించాలంటే భారీగా ఖర్చు చేయాల్సిందేననే భావనకు వచ్చారు. ఆయన పార్టీ పరంగా తాను పోటీ చేస్తున్న నగర ప్రాంతంలో పార్టీ నేతలకు పెద్ద ఎత్తున డబ్బు అందించారని ప్రచారం. అయితే, అసలు చేరాల్సిన వారికి మాత్రం అవి చేరనీయకుండా మధ్యలో ఉండే వారు సైడ్ చేసేసారంటూ ఆ నగర ప్రాంతం లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో, ఆ ముఖ్య నేత సైతం ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. అయితే, వారి నుండి ఓదార్పు మినహా..ఎటువంటి లాభం జరగలేదని ఆయన వాపోతున్నారని ఆ ముఖ్యుడి సన్నిహితులు చెబుతున్నారు.
చెప్పుకోలేని వారు ఎందరో..
ఇక, ఎన్నికల వేళ నమ్మిన వారికి డబ్బులు ఇచ్చిన వారు కొందరైతే...పార్టీలోని ముఖ్యులు డబ్బులు ఇస్తారనే నమ్మకం తో చివరి నిమషం వరకు ఎదురు చూసి ఆ తరువాత పార్టీకి నివేదించటం మినహా మరేమీ చేయలేని పరిస్థితుల్లో మరి కొందరు నేతలు ఉన్నారు. జరగాల్సింది జరిగిపోయిన తరువాత ఇప్పుడు ఎవరికి చెప్పుకున్నా ఏం లాభమని పార్టీ లోని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటకు చెప్పుకోలేక..లోపల దాచుకోలేక వారు పడుతున్న ఆవేదనకు తోడు ఎన్నికల ఫలితాల ఉత్కంఠ మరింత టెన్షన్ పెంచుతోంది.