రూ.1500 కోట్ల స్కాం: వారెవరో తెలియదు... చేతులెత్తేసిన వడ్డీ మహేష్
ఉత్తరాంధ్రలో కలకలం రేపిన భారీ స్కాంలో నిందితుడు వడ్డీ మహేష్ను పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖ: ఉత్తరాంధ్రలో కలకలం రేపిన భారీ స్కాంలో నిందితుడు వడ్డీ మహేష్ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని పోలీసులు సోమవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడారు.
1500 కోట్ల కుంభకోణం: బయటపెట్టిన బెంజ్ కారు! ఎలా జరిగిందంటే?
కేసును సీఐడికి అప్పగించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. హవాలా కేసును ఇతర దేశాలలోను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తండ్రి, బంధువులతో కలిసి మహేష్ డొల్ల కంపెనీల్ని సృష్టించాడన్నారు. ముగ్గురు నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.
తనకు తెలియదని..
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన రూ.1500 కోట్ల హవాలా కుంభకోణంలో డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు పంపిన నిధులెవరివో తనకు తెలియదని ప్రధాన నిందితుడు వడ్డి మహేశ్ చేతులెత్తేశాడు.
మహేష్ అరెస్ట్
మహేశ్ను శనివారం విశాఖపట్నానికి తీసుకువచ్చిన పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం ఓ ప్రాంతానికి తరలించి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అతను ఆసక్తికర విషయాలు వెల్లడించారని తెలుస్తోంది.
పంపడం వరకే నా బాధ్యత
కమీషన్లకు కక్కుర్తి పడి డొల్ల కంపెనీలను సృష్టించానని, ఆ డబ్బులు తనవి కావని, ఢిల్లీకి చెందిన ముగ్గురు ఆ నగదును తీసుకువచ్చేవారని, తాను సృష్టించిన డొల్ల కంపెనీల నుంచి నగదు పంపడం వరకే తన బాధ్యత అని చెప్పాడని తెలుస్తోంది.
నాకు కమిషన్ ఇచ్చేవారని..
ప్రతిఫలంగా తనకు కమీషన్ ఇచ్చేవారని, చైనా, హాంకాంగ్, సింగపూర్లలో ఎవరికి పంపారన్న వివరాలు తనకు తెలియవని చెప్పాడని తెలుస్తోంది. అయితే వడ్డీ మహేష్ చెప్పిన ఆ ముగ్గురు ఎవరు? ఎలా పరిచయం అయ్యారు? అనే దానిపై పోలీసులు కూపీ లాగనున్నారు.