రుతుపవనాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
అమరావతి: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక ప్రాంతాలకు రానున్న రెండు రోజుల్లో పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఏపీలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
మధ్యప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు, ఛత్తీస్గఢ్ లోని మిగిలిని ప్రాంతాలు, కోస్తాంధ్ర, వాయువ్య బంగళాఖాతంలోని మిగిలిన భాగాలు, మొత్తం ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్, చాలా వరకు జార్ఖండ్, బీహార్లోని కొన్ని భాగాలు, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు పోర్ బందర్, బరోడా, శివపురి, రేవా, చుర్క్ మీదుగా కొనసాగుతుంది. ఆదివారం విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి సోమవారం దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రానున్న మూడు రోజులపాటు ఏపీలోని చాలా ప్రాంతాల్ల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఉత్తరకోస్తా, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు, దక్షిణ కోస్తాలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఇది ఇలావుండగా, రాయలసీమలోనూ నేటి నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించించింది.