కేరళను తాకిన రుతుపవనాలు: 2వారాల్లో తెలుగు రాష్ట్రాలకు వర్షాలు
నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళ తీరాన్ని తాకాయి. రుతుపవనాలు రెండు రోజులు ముందుగానే తీరాన్ని తాకినట్లు తెలుస్తోంది. కాగా, వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో అనుకున్న సమయానికే రుతుపవనాలు
తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళ తీరాన్ని తాకాయి. రుతుపవనాలు రెండు రోజులు ముందుగానే తీరాన్ని తాకినట్లు తెలుస్తోంది. కాగా, వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో అనుకున్న సమయానికే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
నైరుతీ రుతుపవనాల వల్లే దేశవ్యాప్తంగా సుమారు 70 శాతం వర్షం నమోదు అవుతుంది. జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేరళలోని దక్షిణ భాగంలో సోమవారం నుంచి విస్తారంగా కురుస్తున్నాయి.
కేరళలోని అలప్పుజా, కొట్టాయమ్ జిల్లాల్లో 6సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొచ్చిలో 5 సెంటీమీటర్లు, త్రిసూర్, కోజికోడ్ జిల్లాల్లో మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో అయిదు రోజుల పాటు కేరళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి.
రుతుపవనాల ప్రవేశంతో అవి మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలోకి రుతుపవనాలు సోమవారమే ప్రవేశించాయి.