నేటి నుంచే...ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు:పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అమరావతి: శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉదయం 8.15 గంటలకు శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఖరారు చేస్తారు.
అనంతరం 9.15 గంటలకు శాసనసభ, 9:45 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ సమావేశాలకు హాజరయ్యే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 7.30 గంటలకు వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
శాసనసభ ప్రారంభమైన వెంటనే ముందుగా మాజీ ప్రధాని వాజ్పేయీ సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు హరికృష్ణ సంతాప తీర్మానం శుక్రవారం నాడు ప్రవేశపెడతారు.
Recommended Video
బుధవారం పోలీసులు ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులతో స్పీకర్ కోడెల, శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా అసెంబ్లీ సమావేశాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండీ ఫరూక్లు అధికారులను ఆదేశించారు. ఇటీవల గుంటూరులో నారా హమారా, తెదేపా హమారా సభలో కొందరు వ్యక్తులు సృష్టించిన గందరగోళంపై సమావేశంలో చర్చించారు.