'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?
అమరావతి/హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు జాతీయ ఛానళ్లు దేశవ్యాప్తంగా ప్రీ పోల్ సర్వేలు చేస్తూ తమ తమ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేల్లోను బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గుతాయని, కాంగ్రెస్ కాస్త పుంజుకుంటుందని, కానీ అధికారం మాత్రం మళ్లీ నరేంద్ర మోడీదేనని చెబుతున్నాయి. బీజేపీకి మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు ఉన్నట్లుగా తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోను శాంపిల్స్ తీస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ తదితర పార్టీల ప్రభావంపై సర్వే ఫలితాలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీలను పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుందని దాదాపు ఏ సర్వేల్లో తేలలేదనే చెప్పాలి.
జగన్ పద్ధతి మార్చుకో, చంపేస్తామంటున్నారు.. చంపేయండి: వంగవీటి రాధాకృష్ణ
జనసేనను పరిగణలోకి తీసుకోలేదా?
అందుకు కారణం ఉంది. జాతీయ మీడియా తమ తమ సర్వేలను గత ఏడాది నుంచి మొదలు ఈ జనవరి మధ్య చేశాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తున్నారు. ఆయన గత మూడు నాలుగు నెలలుగా ఏపీలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. త్వరలో ఆయా జిల్లాల్లో పర్యటించి సమస్యలపై అవగాహన పెంచుకోనున్నారు. ముఖ్యంగా ఆయన ఇటీవలి వరకు దాదాపు టీడీపీ మిత్రపక్షంగా కనిపించడం పార్టీని ఈ మధ్యనే జనాల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో జనసేనను జాతీయ మీడియా ఛానల్స్ పరిగణలోకి తీసుకోకపోవచ్చునని భావిస్తున్నారు. అదే సమయంలో జనసేనను 'ఇతరుల'లోకి లెక్కకట్టారా కూడా తెలియాల్సి ఉంది.
జనసేనకు అదనపు బలం
కానీ ఆయా సర్వేల తీరును చూడటంతో పాటు, జనసేనాని ఇటీవలే ప్రజల్లోకి వెళ్తున్నందున జనసేన పార్టీని పరిగణలోకి తీసుకోకపోయి ఉండవచ్చునని అంటున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీల మధ్యే హోరాహోరీ కనిపిస్తోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్తో పాటు జనసేన మధ్యనే పోటీ ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. జనసేనకు లెఫ్ట్ పార్టీల మద్దతు మరో బలం. ఇక, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేసినా నామమాత్రమే అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రభావం
ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమాత్రం తక్కువగా ఉండదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది అని భావిస్తున్నారు. జనసేన గెలుస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే టీడీపీ, వైసీపీల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, పవన్ ప్రభావంతో కర్ణాటక వలె హంగ్ ఏర్పడినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని, అప్పుడు పవన్ చక్రం తిప్పడం ఖాయమని భావిస్తున్నారు.
జనసేన మైనస్గానే ఎందుకంటే?
పవన్ కళ్యాణ్ను అధికార, ప్రతిపక్షాలతో పాటు ఎవరూ తక్కువగా అంచనా వేయడం లేదని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వస్తున్న ప్రీపోల్ సర్వే ఫలితాలు 'మైనస్ జనసేన' వస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి. లేదంటే జనసేన ప్రభావంపై కచ్చితంగా చెప్పేవి. ప్రస్తుతం వస్తున్న ప్రీపోల్ సర్వే ఫలితాలు అన్నీ 'మైనస్ జనసేన'గానే చెప్పవచ్చునని అంటున్నారు. ఇటీవలి సర్వేల్లో వైసీపీకి 13 నుంచి 19, టీడీపీకి 6 నుంచి 11 సీట్లు వస్తాయని తేలాయి. జనసేన ప్రభావం ఉంటే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత? జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి? అనేది తేలుతుందని అంటున్నారు. జనసేన ప్రభావంతో ఏపీ విషయంలో ఇప్పుడు వస్తున్న సర్వేల్లో భారీ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.