బాబుపై దుమ్మెత్తిపోసిన మోపిదేవి, కేసీఆర్కు అప్పుడు గుర్తులేదా: గాలి
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
కమీషన్ల కోసమే పట్టిసీమ తప్పా, ప్రజల ప్రయోజనం కోసం కాదని విమర్శించారు. దాని వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పట్టిసీమ ప్రాజెక్టు నుంచి బుధవారం చంద్రబాబు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.
కేసీఆర్కు అప్పుడు గుర్తుకు లేదా: గాలి
విభజన చట్టం తన కను సన్నుల్లో జరిగిందని గొప్పగా చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు.. హైకోర్టు విభజన గురించి అప్పుడు ఎందుకు గుర్తుకు లేదని ఏపీ టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం ప్రశ్నించారు.
అప్పుడు హైకోర్టు విభజనను ఆయన ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలన్నారు. హైకోర్టుకు అమరావతిలో స్థలం చూపించామని, అయినా కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సీఎం చంద్రబాబును ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
సాగునీరు, సంస్థల విభజనలో వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఐటికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనని చెప్పారు. సిమ్లాలో జరిగిన ట్రాన్సుపోర్టు మంత్రుల సదస్సులో ఫాస్ట్ పథకాన్ని మెచ్చుకొని, పథకాన్ని దేశస్థాయిలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారని, కేసీఆర్ ట్రాన్సుపోర్ట్ మంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు ఈ పథకం పెట్టారన్నారు.