కొణతాల షాక్పై మోపిదేవి, జగన్ వచ్చినప్పుడే...
విశాఖ/హైదరాబాద్: కొణతాల రామకృష్ణ వ్యవహారంపై మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోపిదేవి వెంకటరమణ మంగళవారం స్పందించారు. పార్టీలో గౌరవం లేదన్నది వాస్తవం కాదన్నారు. త్వరలో వివాదం సర్దుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం కొణతాల ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారో అలాంటి సేవలనే ముందుముందు పార్టీకి అందిస్తారని చెప్పారు.
పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే పట్టించుకోని నాయకుల పైన చర్యలు తీసుకుంటే తప్పేమిటని మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అమర్నాథ్ ప్రశ్నించారు. గండి బాబ్జీని తప్పించడం సరైన చర్యనే అన్నారు. కొణతాల పార్టీకి దూరమవుతున్నట్లుగా తాను మీడియా ద్వారానే చూశానని చెప్పారు. పార్టీ పైన కొణతాలకు అసంతృప్తి ఉన్న విషయం తమకు ఎప్పుడు చెప్పలేదన్నారు.
కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలిన విషయం తెలిసిందే. కొణతాల మంగళవారంనాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి ఫాక్స్ ద్వారా పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసిన విషయాన్ని కొణతాల రామకృష్ణ ధ్రువీకరించలేదు.
చాలా కాలంగా కొణతాల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల హుధుద్ తుఫాన్ బాధితులను పరామర్శించడానికి జగన్ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆయన కనిపించలేదు. ఆయన పార్టీకి దూరమైనట్లేనని గత కొంత కాలంగా అనుకుంటూ వస్తున్నారు. తాజాగా కొణతాల పార్టీలో పదవికి రాజీనామా చేశారు.
కొణతాల ఇప్పటికీ తమ పార్టీ నేతనే అని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. కొణతాల రాజీనామాను తాను మీడియాలోనే చూశానని చెప్పారు. ఒకవేళ పార్టీలో ఏదైనా ఇబ్బంది ఉంటే అది టీ కప్పులో తుఫానులా తీరిపోతుందన్నారు.
పరారీలో ఎమ్మెల్యే తనయుడు
విజయవండ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు తనయుడు సిద్ధార్థ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారి పైన జరిగిన కారు రేసు కేసులో సిద్ధార్థతో పాటు మరో ఏడుగురి పైన యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి సిద్ధార్థ అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోవైపు పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.