ఏపీలో బీసీ రిజర్వేషన్ రగడ, బీసీలకు రిజర్వేషన్ తగ్గించాలని కోరిందే చంద్రబాబు: మంత్రి మోపిదేవి..
బీసీ రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 58 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీలను ఓన్ చేసుకొనేందుకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి మోపిదేవి వెంకటరమణ ఫైరయ్యారు. బీసీలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు చేసే రాజకీయాలు ఏపీ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ గుర్తుచేశారు. బీసీల జపం చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఫైరయ్యారు. బీసీలకు రిజర్వేషన్లు కేటాయించే సమయంలో మిన్నకుండిపోయిన.. చంద్రబాబు, హైకోర్టు తీర్పు తర్వాత స్వరం పెంచారని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్ తగ్గించాలని ఇదివరకు కోరింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తితో కేసులు కూడా వేయించారని గుర్తుచేశారు. ఇప్పుడేమో సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.
తాను చెప్పిన పని చేసిన ప్రతాప్ రెడ్డికి పదవీ కూడా కట్టాబెట్టారని మోపిదేవి చెప్పారు. ఇప్పుడెమో రిజర్వేషన్ తగ్గించొద్దని చెబుతున్నారు.. ఇంతకీ చంద్రబాబు ఏ మాట నమ్మాలి అని అడిగారు. పూటకో మాట మాట్లాడితే ప్రజలు విశ్వసించారనే విషయం కూడా తెలియదా అని దుయ్యబట్టారు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీల పక్షాన ఉన్నారని చెప్పారు.