పోలీసులే నివ్వెరపోయేలా!: భర్త హత్య వెనుక ప్రియుడితో కలిసి సరస్వతి వేసిన స్కెచ్ ఇదీ!
విజయనగరం: నవ వరుడు యామక గౌరీ శంకర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. కట్టుకున్న భార్య సరస్వతే గౌరీశంకర్ హత్య వెనుక ప్రధాన సూత్రధారి అని ఇదివరకే తెలియగా.. అతని హత్య కోసం ప్రియుడితో కలిసి ఆమె పెద్ద పథకమే రచించిందని పోలీసుల తాజా విచారణలో బయటపడింది. లేచిపోయి పెళ్లి చేసుకోవడం కన్నా భర్తను లేపేయడమే మంచిదని సరస్వతి ప్రియుడికి సలహా ఇచ్చినట్టుగా విచారణలో తేలింది.
ప్రియుడి అరెస్ట్:
కేసులో మరో ప్రధాన నిందితుడైన సరస్వతి ప్రియుడు శివను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య తర్వాత విజయవాడలో తలదాచుకుంటున్న శివ.. అక్కడినుంచి మరో చోటకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. శివను అదుపులోకి తీసుకుని విచారించగా పలు విస్తుపోయే విషయాలు చెప్పాడు. శివ చెప్పిన విషయాలు విని నివ్వెరపోయిన పోలీసులు.. కేసును మరింత లోతుగా ఆరా తీస్తే ఊహకందని విషయాలు ఇంకెన్ని బయటపడుతాయో అని చెప్పడం గమనార్హం.
ఇదీ స్కెచ్:
'లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్లు ఇక ఎన్నటికీ చేరదీయరు. పెళ్లయిన యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకోవడం అసలు ఒప్పుకోరు. కాబట్టి గౌరీశంకర్నే అడ్డు తొలగిస్తే మన పెళ్లికి మార్గం సుగమం అవుతుంది.' అని సరస్వతి, ఆమె ప్రియుడు శివ కలిసి పథకం రచించారు. ఇందుకోసం ఓ సుపారీ గ్యాంగును రంగంలోకి దింపి హత్య చేయించాలనుకున్నారు. ఆపై హత్యను దారి దోపిడీ దొంగలపైకి నెట్టాలని ప్లాన్ వేశారు.
హత్య తర్వాత..:
'గౌరీ శంకర్ చనిపోయిన కొద్దిరోజులకు శివ ఎంట్రీ ఇస్తాడు. పెళ్లయిన కొద్దిరోజులకే వితంతువుగా మారిన సరస్వతిని తాను వివాహం చేసుకుంటానని ఓ ఆదర్శ పురుషుడిలా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. అసలే బిడ్డ భవిష్యత్తుపై బెంగతో ఉంటారు కాబట్టి.. అతని ప్రతిపాదనకు వారు ఒప్పుకుంటారు.' ఇదీ సరస్వతి, శివ కలిసి వేసిన స్కెచ్.
సుపారీ గ్యాంగుతో ఒప్పందం:
అనుకున్నట్టుగానే బెంగళూరులో ఓ సుపారీ గ్యాంగుకు రూ.25వేలు ముట్టజెప్పారు. అయితే డబ్బు తీసుకున్నాక.. 'హత్య చేయడమెందుకు.. మీరే పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా!' అంటూ ఆ గ్యాంగ్ వీరికి సలహా ఇచ్చింది. దీంతో మీరు కాకపోతే ఇంకొకరిని చూసుకుంటామని సరస్వతి, శివ వారితో చెప్పారు. దీంతో హత్యకు ఆ గ్యాంగ్ ఒప్పుకుంది. బెంగళూరులో హత్యకు ప్లాన్ చేసినా కుదరకపోవడంతో.. శ్రీకాకుళం లేదా విజయనగరంలో హత్య చేస్తామని మాటిచ్చారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే వారి ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో సరస్వతి, శివ వేరేవాళ్లను సంప్రదించారు.
హత్య జరిగిన రోజే పార్వతీపురంలోనే శివ:
బెంగళూరు గ్యాంగ్ హ్యాండ్ ఇవ్వడంతో మరో గ్యాంగుతో డీల్ కుదుర్చుకున్నాడు శివ. ఆ మేరకు గౌరీశంకర్ను హత్య చేయడానికి వారం రోజుల ముందే తను కూడా శివ పార్వతీపురం చేరుకున్నాడు. సుపారీ గ్యాంగ్తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ హత్య పథకాన్ని అమలుచేశాడు. 7వ తేదీ రాత్రి గౌరీశంకర్ని తోటపల్లి వద్ద హత్య చేసే సమయానికి కొద్ది నిమిషాల ముందు పార్వతిపురం నుంచి అనకాపల్లి పారిపోయాడు.
హత్య నేపథ్యం:
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలానికి చెందిన సరస్వతి బీఎస్సీ చదవడం కోసం 2016లొ విశాఖపట్నం వెళ్లింది. అక్కడ ఫోటోగ్రాఫర్ మడ్డు శివతో ఫేస్బుక్ పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. అయితే ఇంతలోనే వరుసకు మేనమామ అయిన గౌరీశంకర్ తో కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం కుదిర్చారు. గౌరీ శంకర్ కర్ణాటకలో ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న సరస్వతి.. ప్రియుడు శివతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఆ పథకం ప్రకారమే ఈ నెల 7న గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద ఐటీడీఏ పార్కు సమీపంలో గౌరీశంకర్ ను హత్య చేశారు.