ఇటు వైసీపీ-అటు బీజేపీ- ఉత్తరాంధ్రలో నలిగిపోతున్న టీడీపీ- తెరపైకి కొత్త వ్యూహాలు...
ఏపీలో మూడు రాజధానుల ప్రకటన మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీకి తీవ్ర నష్టం చేకూర్చేలా ఉందని ఉత్తరాంధ్రలో తాజా పరిస్ధితులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడం ద్వారా టీడీపీలోని ప్రధాన నేతలను ఇప్పటికే ఆ పార్టీకి దూరం చేసిన వైసీపీ ఇప్పుడు మిగతా వారిని కూడా టార్గెట్ చేసే పనిలో బిజీగా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా టీడీపీ మాజీ మంత్రులను, ద్వితీయ శ్రేణి నేతలను టార్గెట్ చేయడంతో ఆ పార్టీకి కక్కలేని మింగలేని పరిస్ధితి ఎదురవుతోంది. వైసీపీపై కనీస విమర్శలు చేస్తున్న టీడీపీ.. బీజేపీని మాట మాత్రం అనలేక చోద్యం చూడాల్సి వస్తోందంటే అతిశయోక్తి కాదు. దీంతో టీడీపీ ప్రత్యామ్నాయ వ్యూహాలపై దృష్టిసారిస్తోంది.
డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ ఫ్యామిలీలు - రకుల్ ప్రీత్కు ఉన్నదేంటి?: టీడీపీ నేత దివ్యవాణి సంచలనం
ఉత్తరాంధ్ర టీడీపీ కంచుకోట...
ఉత్తరాంధ్రలో టీడీపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రాక ముందు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య సాగిన పోరు ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీగా మారిపోయింది. ఈ పోరులో అర్బన్ ప్రాంతాలు కాంగ్రెస్కూ, రూరల్ ప్రాంతాలు టీడీపీకి పట్టం గట్టేవి. ఓ దశలో అర్బన్ ప్రాంతాల్లోనూ టీడీపీ గట్టిగా పట్టు పెంచుకుంది. ఇందుకు ఉత్తరాంధ్రలోని బీసీ సమీకరణాలే కారణం. వీటితో పాటు ఎర్రన్నాయుడు, ధర్మాన కుటుంబాల మధ్య పోరు, విజయనగరంలో బొత్స, అశోక్గజపతిరాజు కుటుంబాల పోరు, విశాఖలో అర్బన్ ఓటింగ్... ఎన్నికలను ప్రభావితం చేస్తూ వచ్చాయి. అయినా బీసీల్లో టీడీపీకి ఉన్న పట్టు ఆ పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కంచుకోటగా మార్చేసింది. నిన్న మొన్నటి వరకూ అదే పరిస్ధితి కొనసాగింది.
రాజధాని రాకతో వైసీపీకి నేతల క్యూ...
విశాఖను తమ భవిష్యత్ కార్యక్షేత్రంగా నిర్ణయించుకున్న వైసీపీ విపక్షంలో ఉండగానే ఈ ప్రాంతంలో పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం నుంచే పాలన సాగిస్తామని కీలక నేతలకు సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే ఎంత ప్రయత్నించినా గత ఎన్నికల్లో విశాఖ నగరంలో నాలుగు స్ధానాలను టీడీపీకి కోల్పోయింది. రూరల్లో మాత్రం గట్టెక్కింది. సగం పని పూర్తయిందని భావించిన వైసీపీ.. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనలో విశాఖకు చోటివ్వడంతో మరోసారి వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే టీడీపీకి కీలకమైన విశాఖ డెయిరీ కుటుంబాన్ని, పార్టీ రూరల్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబును, తాజాగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ను వైసీపీలో చేర్చుకుంది. ఓ దశలో గంటా శ్రీనివాస్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నించినా చివరి నిమిషంలో సమీకరణాలు కుదరలేదని తెలుస్తోంది.
వైసీపీకి పోటీగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్..
గతంలో ఉత్తరాంధ్రలో గణనీయంగా ప్రభావం చూపిన అనుభవం ఉన్న బీజేపీకి వైసీపీ ప్రభుత్వంలో మరోసారి ఈ ప్రాంతంలో అనుకూల పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీ మద్దతుతో విశాఖ ఎంపీ స్ధానం గెల్చుకున్న బీజేపీ.. మరోసారి ఇక్కడ ప్రభావం చూపేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీకి దూరమై వైసీపీకి కూడా వెళ్లకుండా ఎదురుచూస్తున్న మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, సుజయకృష్ణ రంగారావులను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు సోము వీర్రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా బీజేపీ పంచన చేరేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సింహాచలం, మాన్సాస్ వ్యవహారాల్లో వైసీపీని ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్న టీడీపీ నేతలు.. బీజేపీలో చేరి తమ వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు. దీంతో బీజేపీ సాధ్యమైనంత త్వరగా వీరిని పార్టీలోకి తెచ్చేందుకు మంతనాలు జరుపుతోంది.
Recommended Video
పట్టు వీడని టీడీపీ- ప్రత్యామ్నాయ వ్యూహాలు...
ఓవైపు వైసీపీ, మరోవైపు బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నా టీడీపీ మాత్రం గతంలో తమ కంచుకోట అయిన ఉత్తరాంధ్రలో వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేదు. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు స్ధానంలో అచ్చెన్నాయుడుకు పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమవుతున్న టీడీపీ.. అటు కళాకు పోలిట్ బ్యూరోలో స్ధానం కల్పించాలని నిర్ణయించింది. తద్వారా ఇక్కడ అసంతృప్త జ్వాలలు ఎగసిపడకుండా జాగ్రత్త పడుతోంది. విశాఖలో పరిస్ధితులు ఇంతా తమ చేజారలేదని భావిస్తున్న టీడీపీ అక్కడ మిగిలిన ఎమ్మెల్యేలతోనే రాజకీయానికి సిద్ధమవుతోంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అండతో రాజకీయం కొనసాగించవచ్చని టీడీపీ గట్టి ధీమాగా కనిపిస్తోంది. అదే సమయంలో శ్రీకాకుళంలోనూ స్ధానిక రాజకీయాల ప్రభావంతో తమకు పరిస్ధితులు అనుకూలంగానే ఉన్నాయని నమ్ముతోంది. ఎటొచ్చీ విజయనగరం జిల్లాలోనే టీడీపీకి కలిసిరావడం లేదు. కొత్తగా ప్రకటించిన పార్లమెంటరీ అధ్యక్షులు, కమిటీల ప్రభావం ఉత్తరాంధ్రపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.