బ్యాంకు లోన్: పాస్ పుస్తకం ఫోర్జరీతో పాటు కొడుకునే మార్చేసిన తండ్రి
విశాఖపట్నం: కుమారుడి ఫోటో మార్చేసి, అతని పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి లక్షల రూపాయలను పొందిన ఓ తండ్రి ఉదంతమిది. ఈ సంఘటన విశాఖ జిల్లాలోని మాకవరపాలెం మండలం తూటిపాల పంచాయతీ శివారు మామిడిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన కచ్చళ్ల రామునాయుడుకు బాలరాజు (36), అప్పలనాయుడు (23) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో బాలరాజుకు వివాహం కాగా ప్రస్తుతం నెల్లూరులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి మామిడిపాలెంలోనే నివాసం ఉంటుంది.
వ్యవసాయ పనుల కోసం రామునాయుడు నర్సీపట్నంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేశాడు. నెల్లూరులో ఉన్న బాలరాజుకు తెలియకుండా అతని పేరు మీద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఫోర్జరీ చేసి ఈ రుణం తీసుకున్నాడు.
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రుణం తీసుకునేందుకు తనఖా పెడుతూ నర్సీపట్నం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో చేయించిన తనఖా రిజిస్ట్రేషన్లో తన పెద్ద కుమారుడు బాలరాజు ఫొటోకు బదులు మరొకరి ఫొటో పెట్టాడు. తండ్రి రుణం బాలరాజుకి ఇష్టం లేకపోవడంతో అతని పేరు మీదున్న పట్టాదారు పాస్ పుస్తకంలో అతని ఫోటో తొలగించి అదే మండలంలో పెదరాచపల్లి శివారు వెంకయ్యపాలెం గ్రామానికి చెందిన కూండ్రపు అప్పలనాయుడు ఫొటో అతికించాడు.
అతనే తన పెద్ద కుమారుడు బాలరాజు అంటూ అధికారులను మభ్యపెట్టి తనఖా రిజిస్ట్రేషన్ చేయించి హెచ్ డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ. 6.13 లక్షలు రుణం పొందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలరాజు భార్య లక్ష్మీ తన భర్త పేరిట ఉన్న 2.62 ఎకరాల భూమిని తమకు తెలియకుండా నర్సీపట్నం బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నాడంటూ తహసీల్దార్కు, మాకవరపాలెం ఎస్సైకు ఫిర్యాదు చేసింది.
తాము బ్యాంకు రుణం తీసుకోవడానికి ఈసీ తీయించగా, నర్సీపట్నం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో తమ పొలాన్ని తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలిసిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
హెచ్డీఎఫ్సీ బ్రాంచి అధికారులు జరిగిన మోసాన్ని తెలుసుకుని విస్తుపోయారు. ఈ విషయాన్ని బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో గల రుణ విభాగానికి వెంటనే తెలియజేశారు. అయితే తీసుకున్న రుణంపై వడ్డీ సక్రమంగా చెల్లిస్తున్నట్టుగా బ్యాంకు అధికారులు తెలిపారు.
ఈ రణ కుంభకోణంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, బ్యాంకు అధికారులు తమ వంతు సహాయం చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా రుణం పొందేందుకు 1-బి, అడంగల్, పట్టాదారు, టైటిల్డీడ్, సరిహద్దుల ధృవపత్రాలను రెవెన్యూ శాఖ, ఈసీ ధృవపత్రాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ జారీచేస్తాయి.