అతి దారుణంగా.. పైశాచికంగా.. తల్లీకూతుళ్లు మర్డర్..!
రామచంద్రాపురం : ఏమైందో తెలియదు.. ఎవరు చంపారో తెలియదు.. ఎందుకు హత్య చేశారో తెలియదు. తల్లీకూతుళ్లను అతి దారుణంగా చంపేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. తల్లితో పాటు కూతురును అంత పైశాచికంగా ఎవరు చంపారో తెలియక స్థానికంగా విషాదం నెలకొంది. శనివారం నాడు రాత్రి జరిగిన ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లీకూతుళ్లను దుండగులు హత్య చేశారనే వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
రామచంద్రాపురంలోని చప్పిడివారి సావరం దండు గంగమ్మ గుడి వీధిలో జరిగిన ఈ జంట హత్యలు అనుమానాస్పదంగా మారాయి. తల్లీకూతుళ్లను దుండగులు పొట్టనబెట్టుకున్న తీరు స్థానికంగా భయాందోళన రేకెత్తించింది. గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా సుత్తె (హ్యామర్) తో కొట్టి హతమార్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని ఇరుగు పొరుగు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
గర్ల్స్ హాస్టల్ చుట్టూ డ్రోన్ కెమెరా చక్కర్లు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..!
45 సంవత్సరాల బలుస మాధవి స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆయాగా పని చేస్తున్నారు. ఆమె కూతురు 18 సంవత్సరాల కరుణ మొన్న మార్చి నెలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ప్రస్తుతం ఇంటి దగ్గర ఖాళీగా ఉంటోంది. అయితే మాధవి భర్త శ్రీనివాస్, ఆమె కొడుకు విజయ్ ఉపాధి కోసం కాకినాడలో ఉంటున్నారు. అక్కడ ఓ హోటల్లో పనిచేస్తూ వారానికోసారి ఇంటికి వచ్చి వెళుతుంటారు.
అయితే శనివారం రాత్రి తల్లీకూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. సుత్తెతో వారిద్దరి తలలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో అనుమానస్పద కేసుగా ఫైల్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.