కాకినాడలో దారుణం:ఆస్తి కోసం కొడుకు రగడ...రాడ్డుతో కొట్టి చంపిన తల్లి
తూర్పుగోదావరి జిల్లా:కాకినాడ పరిథిలోని జగన్నాథపురంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్థి కోసం కొడుకు రోజు వేధింపులకు గురి చేస్తుండటంతో పాటు ఏకంగా చంపడానికే ప్రయత్నించడంతో ఓ తల్లి కన్న కొడుకునే రాడ్డుతో కొట్టి హతమార్చింది.
జగన్నాథపురం కు చెందిన పార్వతి అనే మహిళను ఈమె చెడు వ్యసనాలకు బానిసైన ఈమె పెద్ద కుమారుడు శివరామకృష్ణా రెడ్డి ఆస్తి కోసం వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్తిని పంచాల్సిందేనంటూ తల్లి పార్వతిను చంపేందుకు ఐరన్ రాడ్డుతో యత్నించిన క్రమంలో శివరామకృష్ణారెడ్డి కిందపడ్డాడు. దీంతో ఆమె అదే రాడ్డుతో కొడుకు తలపై కొట్టి చంపేసింది. హత్య అనంతరం కాకినాడ ఒన్ టౌన్ పోలీసుల ఎదుట పార్వతి లొంగిపోయింది. వివరాల్లోకి వెళితే...
కాకినాడ జగన్నథపురంలోని ఏసువారి వీధిలో నివాసం ఉంటున్న ప్రతాప రెడ్డి, పార్వతి దంపతలులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు శివరామకృష్ణా రెడ్డి. ఇతడు ఇంజనీరింగ్ , ఆ తర్వాత ఎంబిఎ పూర్తి చేసి ఖాళీగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో వ్యసనాల బారిన పడిన శివరామకృష్ణా రెడ్డి డబ్బుల కోసం తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఆస్తి పంచివ్వాలని రగడ రగడ చేసేవాడు.
ఈ క్రమంలో మంగళవారం ఉన్నట్టుండి తనకు రూ.50 లక్షలు కావాలని తల్లితో గొడవ పెట్టుకున్నాడు. అంత డబ్బు నేనెక్కడ తేవాలి...తన వల్ల కాదని చెప్పింది తల్లి. దీంతో తల్లితో ఘర్షణకు దిగిన శివరామకృష్ణా రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ ఐరన్ రాడ్డుతో ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించిన క్రమంలో పెనుగులాటలో శివరామకృష్ణా రెడ్డి కింద పడ్డాడు. దీంతో తల్లి పార్వతి పక్కనపడిన ఐరన్ రాడ్డుని తీసుకొని కొడుకు తలపై కొట్టింది. దీంతో శివరామకృష్ణా రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం తల్లి పార్వతి పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.