తండ్రి పరలోకంలో.. తల్లి పరాయి దేశంలో.. అనాధలైన బిడ్డలు
జీవనోపాధి కోసం పరాయి దేశం వెళ్లిన తల్లి జాడ తెలియకపోవడం, ఈ దిగులుతో అనారోగ్యానికి గురైన తండ్రి కూడా కన్నుమూయడంతో వారి నలుగురు పిల్లలు అనాధలయ్యారు.
గాలివీడు: జీవనోపాధి కోసం పరాయి దేశం వెళ్లిన తల్లి జాడ తెలియకపోవడం, ఈ దిగులుతో అనారోగ్యానికి గురైన తండ్రి కూడా కన్నుమూయడంతో వారి నలుగురు పిల్లలు అనాధలయ్యారు. ఆ పిల్లలను చూసిన ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతోంది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కడప జిల్లాలోని గాలివీడు మండల పరిధిలో ఉన్న గొట్టివీడు పంచాయితీ రెడ్డివారి పల్లెకు చెందిన పరికిజోన నాగేంద్రనాయుడు(35) అదివారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఇతడికి భార్య పార్వతి, నలుగురు సంతానం ఉన్నారు.
పార్వతి గతంలోనే జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లింది. అక్కడికి వెళ్లిన కొత్తలో రెండు నెలలపాటు ఆమె తాను సంపాదించిన సొమ్మను కుటుంబసభ్యులకు పంపించింది. ఆ తరువాత నుంచి ఆమెకు సంబంధించి ఎలాంటి సమాచారమూ కుటుంబ సభ్యులకు అందలేదు.
దీంతో తమ తల్లి ఆచూకీ తెలపాలంటూ వారు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. భార్య ఆచూకీ తెలియక దిగులు చెందిన నాగేంద్రనాయుడు కూడా తీవ్ర అనారోగ్యానికి గురై నిన్న మరణించాడు.
అమ్మా.. నాన్న ఇద్దరూ దూరం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఆ నలుగురు బిడ్డలు విలపిస్తున్న తీరు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. సౌదీలో ఏమైందో కూడా తెలియని పార్వతి ఆచూకీ తెలుసుకుని ఆమెను స్వదేశానికి రప్పించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ చొరవ చూపాలని గ్రామస్థులు, వారి బంధువులు కోరుతున్నారు.
రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మిదేవమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్ రహీం, మాజీ సర్పంచ్ మల్లికార్జున నాయుడు, మాజీ ఎంపీటీసీ చిన్నారెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. సౌదీలో ఉన్న వారి తల్లిని ఇండియాకు రప్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతామని పేర్కొన్నారు.