చంద్రబాబు ఓడిపోవాలి, కేసీఆర్ స్నేహితుడే అయినా..: మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు
తిరుపతి: ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా మోత్కుపల్లి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు.
చంద్రబాబు ఓడిపోవాలని..
ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని తిరుమల స్వామివారిని కోరుకుంటానని తెలిపారు. దివంగత నేత ఎన్టీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన దయతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అయితే, చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎన్టీఆర్ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు.
కేసీఆర్ స్నేహితుడైనా..
చంద్రబాబు దుర్మార్గుడని తెలంగాణ ప్రజలు తరిమికొట్టే సమయంలో చంద్రబాబుకు తాను అండగా ఉన్నానని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన స్నేహితుడని అయినా కూడా చంద్రబాబును తాను వెనుకేసుకొచ్చినట్లు తెలిపారు. ఇంత చేస్తే.. ఎన్టీఆర్ పుట్టిన రోజున తనను బర్తరఫ్ చేశారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
నమ్మక ద్రోహి, వెన్నుపోటుదారుడు
ఓటుకు నోట్ల కేసులో చంద్రబాబు మొదటి ముద్దాయి అని మోత్కుపల్లి ఆరోపించారు. చంద్రబాబు నమ్మకద్రోహి, వెన్నుపోటు దారుడని విమర్శించారు. ప్రతిపక్షంలో గెలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన రాజకీయ అసమర్థుడని చంద్రబాబుపై మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలను దోచుకోవడం చంద్రబాబుకు అలవాటేనని, అందుకే సీఎం రమేష్ లాంటి వ్యక్తులకు ఎంపీ పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు.
గాలిని చంపారు.. నన్ను బెదరించారు: మోత్కుపల్లి
పదవులు ఇస్తానని మభ్యపెట్టడంలో చంద్రబాబు పీహెచ్డీ ఎద్దేవా చేశారు. గాలి ముద్దు కృష్ణమనాయుడును మానసిక క్షోభకు గురిచేసి చంపారని ఆరోపించారు. చంద్రబాబు తనకు ఎదురు తిరిగిన వారిని బెదరిస్తాడని, లేదంటే అంతమొందించే వరకూ నిద్రపోడని అన్నారు. తనను కూడా పోలీసుల ద్వారా బెదిరించారని, అయినా తాను ఏమాత్రం భయపడనని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.