ఏపిలోకి ఎలక్ట్రిక్ కార్లు : కియో తో ప్రభుత్వం ఒప్పందం: సీయం టెస్ట్ డ్రైవ్..
ఏపి లోకి ఒక ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. పర్యావరణ రహితమైన రాష్ట్రంగా ఏపిని తీర్చిదిద్దేందుకు ఈ కార్లు దోహదం చేయనున్నాయి. పీల్చే గాలిలో నాణ్యత పెంచటానికి విద్యుత్ కార్లు దోహదపడతాయని ప్రభుత్వం చెబుతోంది. అదే విధంగా సౌర విద్యుత్ ధరలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఏపిలో కియో కార్లు..ఛార్జింగ్ స్టేషన్ ను సీయం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.
ఏపిలో కియో కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఏపి ప్రభుత్వం--కియో సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మూడు రకాల కార్లను కియా సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వగా వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభించారు. వీటికి సంబంధించి ఆయన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను సచివాలయంలో ఆయన అందుబాటులోకి తెచ్చారు. కియా కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రారంభించి టెస్ట్ డ్రైవ్ను సీఎం పరిశీలించారు. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించే వాహనాల ప్రోత్సాహకానికి కియా సంస్థతో ఈ మేరకు ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ''భవిష్యత్ తరం ప్రపంచ శ్రేణి రవాణా భాగస్వామ్యం' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సచివాలయంలో నిర్వహించారు.
సీయం చంద్రబాబు టెస్ట్ డ్రైవ్..
కియో కారును స్వయంగా పరిశీలించటానికి సచివాలయంలో ఎలక్ట్రికల్ కారులో ముఖ్యమంత్రి ప్రయాణం చేశారు. కియా కారు సౌకర్యవంతంగా ఉన్నాయని సీయం పేర్కొన్నారు. ఇక్కడ తయారైన కియా కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, 10 శాతం ఎగుమతులకు అవకాశం ఉంటుందని సీయం వివరించారు. వెనుకబడిన అనంతపురం జిల్లా జాతకం కియా అడుగుపెట్టడంతో పూర్తిగా మారిపోయిందని, ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అమర్రాజా వంటి ఆటో రంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్గా మారిందన్నారు. 7300 మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను త్వరలో వ్యర్థం సేకరణ ప్రక్రియలో వినియోగించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఏపీఐఐసీ ఎండీ ఎ. బాబు, కియా మోటర్స్ సీఈవో షిమ్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అత్యంత ఆధునిక నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా కియా మోటార్స్ ఇచ్చింది. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వీలుంది. ముఖ్యమంత్రి కార్ టెస్ట్ డ్రైవింగ్ చేయటంతో అక్కడ ఉన్న కియో మోటార్స్ ప్రతినిధి బృందం ఆసక్తిగా గమనించింది.