మస్తాన్ బాబు మృతదేహాం తరలింపు మరింత ఆలస్యం
హైదరాబాద్: ప్రపంచ ప్రసిధ్దిగాంచిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు భౌతికకాయం తరలింపు మరో రెండు రోజులు ఆలస్యం కానుంది. నిజానికి మస్తాన్బాబు మృతదేహం ఆదివారం రాత్రి చెన్నై చేరుకోవాల్సి ఉంది. కానీ మస్తాన్ బాబు భౌతికకాయానికి విమానంలో చోటు దక్కలేదు.
అర్జెంజీనాలోని ఆండీస్ పర్వతారోహణకు వెళ్లిన మల్లి మస్తాన్ బాబు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మంచుకొండల్లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దాదాపు పది రోజుల తర్వాత మస్తాన్ బాబు మృతదేహాన్ని కనుగొన్న అర్జెంజీనా అధికారులు, ఆయన భౌతికకాయాన్ని భారత్ పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
శనివారం రాత్రే మస్తాన్ బాబు భౌతిక కాయం అర్జెంటీనా నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో విమానంలో మస్తాన్ బాబు భౌతిక కాయానికి చోటు లభించలేదు. దీంతో ఆదివారం రాత్రికి మస్తాన్ బాబు భౌతిక కాయం అర్జెంటీనా నుంచి బయలుదేరే అవకాశం ఉంది.
చెన్నైకి చేరుకున్న తర్వాత మస్తాన్ బాబు భౌతిక కాయాన్ని నెల్లూరు జిల్లాలోని స్వగ్రామం గాంధీ గిరిజన సంఘానికి తరలిస్తారు. అక్కడే ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. మస్తాన్ బాబు మృత దేహం కోసం కుటుంబ సభ్యులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు.