కడప లో స్టీల్ ప్లాంట్ స్థాపనకు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన ఎంపి సీఎం రమేష్...ప్రత్యేక పూజలు
కడప:కడప జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థాపించనున్న స్టీల్ ప్లాంటు నిర్మాణానికి ప్రతిపాదిత తలాన్ని ఎంపి సిఎం సిఎం రమేష్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షపై మండిపడ్డారు.
విభజన హామీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నెరవేర్చకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందని సిఎం రమేష్ దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే విభజన హామీలు నెరవేర్చాలని సిఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎపి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు.
మొత్తం అంచనా...రూ.12 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష నేపథ్యంలో కడపలో ప్రైవేటు భాగస్వామ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని ఎపి కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా డిసెంబర్ నెలలోనే ఆ ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రూ. 2 కోట్ల మూలధనంతో ' రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ 'ను ఏర్పాటు చేయనున్నట్లు, మొత్తం ప్రాజెక్టును రూ. 12వేల కోట్లు గా అంచనావేసినట్లు తెలిపారు.
ప్రతిపాదిత స్థలం...పరిశీలన
ఈ నేపథ్యంలో కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రతిపాదిత ప్రాంతమైన మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె గ్రామంలో ఎంపి సిఎం రమేష్ తో సహా స్థానిక టిడిపి నేతలు పర్యటించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కార్పోరేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ దేవత మారెమ్మ తల్లి ఆలయాన్ని నేతలు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిఎంకు...సిఎం రమేష్ ధన్యవాదాలు...
ఈ సందర్భంగా ఎంపి సిఎం రమేష్ మాట్లాడుతూ కడప లో స్టీల్ ప్లాంట్ , కార్పొరేషన్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ అంగీకరించడం శుభపరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. తాను స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కేంద్రానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా...వారి నుంచి సరైన స్పందన కరువైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ నిర్మిస్తుందని సిఎం చంద్రబాబు ప్రకటించారని, ఇచ్చిన మాట ప్రకారమే స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనుండటంపై ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రం...తుంగలో తొక్కింది
అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగగూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు చొరవగా ముందుకొచ్చి కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. వైఎస్ హయాంలో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పేరు చెప్పి భారీగా దోపిడీ జరిగిందని ఆరోపించారు.