ఏపీ రైల్వే కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ .. ప్రజలు ఆవును కోరితే ఎద్దును ఇస్తారా అని ఫైర్
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై మరోమారు విరుచుపడ్డారు. పార్లమెంట్ లో ఆయన ఏపీ రైల్వే కేటాయింపులపై నిప్పులు చెరిగారు. ఎన్నికల జిమ్మిక్కులలో భాగంగా కేంద్రం ఆఖరి నిముషంలో రైల్వే జోన్ ఇచ్చిందని లోక్ సభలో రాం మోహన్ నాయుడు మండిపడ్డారు. రైల్వే జోన్ కేటాయించినప్పటికీ దానికి బడ్జెట్ లో ఏ మాత్రం కేటాయింపులు చెయ్యలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైల్వే జోన్ విషయంలో ఆవు కావాలని డిమాండు చేస్తే కేంద్రం ఎద్దును ఇచ్చిందని ఎంపీ రామ్మోహన్ ఎద్దేవా
మొన్నటికి మొన్న లోక్సభలో ఏపీకి విభజన హామీలపై మాట్లాడిన టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు . బీజేపీ పాలిత రాష్ట్రాలపైనే కేంద్రం ప్రేమ చూపుతోందని, బీజేపీ పాలించని రాష్ట్రాలపై కక్ష సాధిస్తుందని ధ్వజమెత్తిన ఆయన, తాజాగా రైల్వే జోన్ విషయంలో కేంద్రాన్ని తూర్పారబట్టారు . విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవు కావాలని డిమాండు చేస్తే కేంద్రం ఎద్దును ఇచ్చిందని రామ్మోహన్ ఎద్దేవా చేశారు. మేము ఆవును అడిగితే ఎద్దును ఇచ్చారని ప్రశ్నిస్తే మీరు జంతువును అడిగితే మేము జంతువునే ఇచ్చామని సమాధానం చెప్తుందని ఆయన కేంద్రం తీరును పార్లమెంట్ వేదికగా ఎండగట్టారు.
వాల్తేరు డివిజన్ను కేంద్రం మూసేయాలని చూస్తోందని మండిపడిన ఎంపీ రాం మోహన్ నాయుడు
గురువారం లోక్సభలో రైల్వే పద్దులపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ సర్కారును వాల్తేరు, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు కలిపి వాల్తేరు డివిజన్ ప్రధాన కార్యాలయంగా జోన్ ఏర్పాటుచేయాలని కోరితే కేంద్రం వాల్తేరు డివిజన్ను మూసేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం ఉందని దశాభ్దాల ఆంధ్రా ప్రజల కల రైల్వే జోన్ అని పేర్కొన్న ఆయన కేంద్రం ఏపీకి మొండి చేయిస్తూ తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు 4స్టేషన్లు కొత్తజోన్లో చేర్చాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. అలాగే బడ్జెట్లో విశాఖ, విజయవాడ మెట్రోల ఊసే లేదని , రాష్ట్రంలో 80 కొత్తలైన్లు, 50 డంబ్లింగ్ పనులు చేపట్టాల్సి ఉందని టీడీపీ ఎంపీ పేర్కొన్నారు.
సమయం సద్వినియోగం చేసుకుంటూ కేంద్రాన్ని తూర్పారబడుతున్న ఎంపీ రాం మోహన్ నాయుడు
మొన్నటికి మొన్న తనకు నాలుగు నిమిషాలపాటే సమయం కావాలని కోరిన రామ్మోహన్ నాయుడు తనకు ఇచ్చిన సమయంలోనే అనర్గళంగా మాట్లాడి తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తెలియజేసి , తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధి అంటే గుజరాత్ ఒక్కటేనా? అని పార్లమెంట్ లో ప్రశ్నించిన రాం మోహన్ నాయుడు సమైక్య స్ఫూర్తి గురించి మాట్లాడే అర్హత మోదీ సర్కారుకు లేదన్నారు. ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర సర్కార్ కు ఉందని చెప్పి కావాలనే ఏపీపై చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు.