ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమనాలా .. అసమర్ధత అనాలా ? ఎంపీ గల్లా జయదేవ్ ఫైర్
ఏపీలో కృష్ణానదికి ఒక్కసారిగా వరద ముంచెత్తిన నేపధ్యంలో అన్ని ప్రాజెక్ట్ ల గేట్లు తెరవటం దాని వల్ల లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాలు ముంపుకు గురి కావటం తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వం వరద ముంపు గ్రామాలలో తీసుకోవాల్సిన చర్యలు అటుంచి చంద్రబాబు ఇంటికి వరద ముంపుపై పదేపదే చంద్రబాబు ఇంటివద్ద పరిస్థితి సమీక్షించటం , డ్రోన్లు వినియోగించి చంద్రబాబు ఇంటిపైనే వరద ప్రభావం తెలుసుకోవాలని చేసిన చర్యలు టీడీపీ వర్గాల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఇక వైసీపీ ప్రభుత్వ అవగాహనా రాహిత్యమో, లేకా కావాలని చంద్రబాబు ఇల్లు ముంచే కుట్రో కానీ వరదలతో మున్చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికీ వరద ముంపుకు కారణం ప్రస్తుత ప్రభుత్వమని మండిపడుతున్నారు.
ఇదంతా బాబు కుట్ర .. ఫిరాయింపులైనా ... వరదముంపు అయినా కుట్ర స్టోరీలే అంటున్న విజయసాయి
ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగుదేశం నేత, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ తీవ్రంగా మండిపడ్డారు. తాను ఇటీవల లంక గ్రామాల ప్రజలతో మాట్లాడాననీ, వర్షాలు లేకుండా ఈ స్థాయి వరదను తాము ఎన్నడూ చూడలేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని జయదేవ్ తెలిపారు. వైసీపీ సర్కార్ ఈ ఉపద్రవాన్ని అంచనా వెయ్యలేదా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ముందస్తు సమాచారం వచ్చినా సరైన చర్యలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమయిందని ఎంపీ గల్లా జయదేవ్ దుయ్యబట్టారు.
ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఒకేసారి డ్యామ్ గేట్లు తెరవడం వల్లే పలు ప్రాంతాలు మునిగిపోయాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం అనాలా? లేక అసమర్థత అనాలా? అని జయదేవ్ ప్రశ్నించారు.ఈ మేరకు ట్వీట్ చేసిన గల్లా జయదేవ్ ఒక్కసారిగా గేట్లు తెరవటం వల్లే ఈ విపత్తు సంభవించింది అని పేర్కొన్నారు. అలాగే ఇది ప్రకృతి విపత్తు కాదని, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య పర్యవసానం అని ఆయన అభిప్రాయపడ్డారు. పలు ప్రాంతాలు ముంపుకు గురై ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇది అసమర్ధ పాలన కాకుంటే ఇంకేంటి అన్న ధోరణిలో ఆయన వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు.