ఎంపి కొత్తపల్లి గీత ఏ పార్టీలో ఉన్నారు?...చెప్పాలి కదా...
అరకు ఎంపి కొత్తపల్లి గీత పొలిటికల్ ఫ్యూచర్ పై కన్ఫ్యూజ్ అవుతున్నారా? తాను కన్ఫ్యూజ్ అవుతూ జనాన్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అసలు ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉంది?...మొన్నే టిడిపి ఎంపీలతో కలసి ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నారని అనుకోవాలా? లేక తానే ప్రకటించినట్లు ఆమె ఏ పార్టీలో లేదనుకోవాలా?
వైసిపి బ్యానర్ మీద గెలిచి టిడిపితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మళ్లీ ఆ పార్టీ అధినేత మీదే తీవ్ర ఆరోపణలు చేస్తున్న అరకు ఎంపి కొత్తపల్లి గీత అసలు ఏమాలోచిస్తున్నారు? ఆమె మదిలో ఏముంది?...జరిగిన...జరుగుతున్న పరిణామాలు అన్నింటిని బట్టి చూస్తే ఒక్క విషయం మాత్రం అర్థమవుతోంది.
ఎంపి కొత్తపల్లి గీత తీవ్ర గందరగోళంలో ఉన్నారని...అయితే ప్రజా క్షేత్రంలో గెలిచి పార్లమెంట్ సభ్యురాలిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆమె ప్రజలందరికి కాకపోయినా కనీసం తన నియోజకవర్గం ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా?...ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారెవరైనా తమను గెలిచిన ప్రజల పట్ల తప్పకుండా జవాబుదారీతనంతో ఉండాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
అప్పుడు అధికారి...తొలిసారే గెలిచారు...
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అధికారిగా ఉన్న కొత్తపల్లి గీత రాష్ట్ర విభజనానంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలపై ఆసక్తితో వైసీపీలో చేరారు. గిరిజన మహిళ, ప్రభుత్వ అధికారిణి, అందులోనూ ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కావటంతో జగన్ కూడా వెంటనే గీతను పార్టీలోకి చేర్చుకుని అరకు పార్లమెంటు సీటు ఇచ్చారు. పోటీ చేసిన మొదటి సారే ఆమె ఘన విజయం సాధించడం విశేషం. అంతవరకూ బాగానే ఉంది.
ఆ తర్వాత ఏమైంది...
ఎంపీగా గెలిచిన తర్వాతే అసలు కథ మొదలైంది. విజయం సాధించిన కొంత కాలానికే ఆమె టిడిపి నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగటం మొదలుపెట్టారు. హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ మొత్తం టిడిపి వాళ్ళతోనే కనిపించారు. దాంతో పరిస్థితి అర్థం చేసుకున్న వైసిపి నేతలు ఎంపి గీతను దూరం పెట్టేసారు. అదే సమయంలో గీత కూడా వైసిపి కార్యక్రమాల్లో పాల్గొనటం మానేసారు. దాంతో ఆమెకి వైసిపికి మధ్య అంతరం అనివార్యమయింది.
చంద్రబాబుతో సమావేశం...ఆ తర్వాత విమర్శలు
ఆ నేపధ్యంలోనే ఎంపి గీత చంద్రబాబునాయుడును కలిసారు. తర్వాత టిడిపిలో చేరినట్లు తానే స్వయంగా ప్రకటించుకున్నారు. అప్పటి నుండి టిడిపి నేతలతోనే ఎంపి తిరుగుతున్నారు. టిడిపిలో కూడా గీతకు కొంతకాలం బాగానే సాగింది. హటాత్తుగా హైదరాబాద్ శివారులోని ఓ భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. అందులో ఎంపి గీత దంపతులే ప్రధాన పాత్రదారులు. సమైక్య రాష్ట్రంలోని హైదరాబాద్ శివారు ప్రాంతంలో గీత ఆర్డీవోగా పనిచేసినప్పుడు ఆ విలువైన భూమిని అక్రమంగా సొంతం చేసుకున్నారన్నది గీత దంపతులపై ప్రధాన ఆరోపణ. అందులోను ఇపుడా భూమి విలువ సుమారు రూ. 500 కోట్లు విలువ వుంటుందట. ఆ భూ కుంభకోణంలో ప్రధానపాత్ర ఎంపి దంపతులదే అని తేలింది. దాంతో ఎంపి భర్తను ప్రభుత్వం అరెస్టు కూడా చేసింది.
చంద్రబాబు ఆదుకోలేదనే...
తాము కేసులో ఇరుక్కున్నపుడు ఆదుకోవాలంటూ చంద్రబాబును కలిసిందట ఎంపి కొత్తపల్లి గీత. అయితే, ఆ కేసులో జోక్యం చేసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారట. దాంతో అప్పటి నుండి చంద్రబాబు మీద వివిధ సందర్భాల్లో విరుచుకుపడుతున్నారు. ఓసారి మీడియాతో మాట్లాడుతూ తనకు టిడిపికి సంబంధం లేదని ప్రకటించేసిన ఆమె ఎస్టీ కమిటీలో స్థానం కల్పించకపోవడంపై చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తరువాత ఇటీవల అరకులో బెలూన్ ఫెస్టివల్ జరిగినప్పడు తనను ఎపి ప్రభుత్వం ఆహ్వానించకుండా అవమానించిందని మరోసారి మీడియాలో హల్ చల్ చేశారు. దీంతో ఇక ఈమెకు టిడిపికి కటీఫ్ అయినట్లేనని అందరూ భావించారు.
మళ్లీ టిడిపి ఎంపీలతో కలసి...
ఆ తరువాత చాలాకాలం మీడియాలో కనిపించలేదు...అటు వైసిపిలో లేక ...ఇటు టిడిపిలో కనిపించక కొత్తపల్లి గీత ఏంచేస్తున్నారో ఎవరికీ అర్దం కాలేదు. ఈ రెండు పార్టీలు కాదనుకుంటోంది కాబట్టి...బిజెపి వైపు ఏమైనా అడుగేస్తారా...లేక జనసేనా?...అని కూడా ఆలోచించారు. అయితే ఈ నేపధ్యంలోనే ఆమె ఉన్నట్టుండి మొన్న ప్రధానమంత్రిని కలిసిన టిడిపి బృందంలో కనిపించడం చర్చనీయాంశం అయింది. ఆమె ఏ ఈక్వేషన్ తో టిడిపి బృందంతో కలిసి ప్రధాని వద్దకు వెళ్ళారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒక పార్లమెంట్ సభ్యురాలు అయివుండి ఇంత బాద్యతారహితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజకీయాల్లో ఎంతో మంది ఫిరాయింపుదారులు ఉన్నా ఈ విధంగా మాత్రం వ్యవహరించలేదనే అప్రతిష్టను ఎంపి కొత్తపల్లి గీత మూటకట్టుకుంటున్నారు. జనాలందరికి కాకపోయినా తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకైనా తన రాజకీయ భవిష్యత్తు గురించి స్పష్టత ఇవ్వాలని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.