అందుకేనా గెలిపించింది:హరిబాబు;రానిదానికి రాజీనామాలెందుకు:చింతామోహన్
విశాఖ,తిరుపతి: ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసిపి అధినేత జగన్ ప్రకటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఘాటుగా ప్రతిస్పందించారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు ఓట్లేస్తే ముందే రాజీనామా చేస్తామంటున్నందుకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు మాజీ ఎంపి చింతామోహన్ ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చేశారు. రాని ప్రత్యేక హోదా గురించి రాజీనామాలెందుకని వైసిపి ఎంపీల రాజీనామా విషయమై వ్యాఖ్యానించారు.
ముందే రాజీనామాలా?...సమాధానం చెప్పండి...
ఐదు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించమని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే, ముందే రాజీనామా చేస్తామని అంటున్నందుకు వైసిపి అధినేత జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని బిజెపి ఎంపీ హరిబాబు డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్ రాజీనామా ప్రకటనకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏఏ అంశాలు పొందుపరిచారో, వాటిని ప్రధాని మోదీ అమలు పరుస్తున్న సమయంలో మళ్లీ ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తామని జగన్ ప్రకటించడం సమంజసంగా లేదని హరిబాబు విమర్శించారు.
ఎపికి కావాల్సింది...ప్రత్యే హోదా కాదు...సామాజిక న్యాయం...
నేటి రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక హోదా కాదని...సామాజిక న్యాయమని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ స్పష్టం చేశారు. తిరుపతిలో ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 25 రాష్ట్రాల్లో సామాజిక న్యాయం ఉందని, అయితే మన ఎపిలో అది లేకపోవడం విచారకరమని అన్నారు. సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించే సీపీఎం, సీపీఐ నాయకులు సామాజిక న్యాయం గురించి ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు.
రాజ్యాధికారం కోసమే...జగన్ పరుగులు...
రాజ్యాధికారం కోసం జగన్ మూడు నెలలుగా ప్రత్యేక హోదా పేరు అడ్డు పెట్టుకుని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరుగులు తీస్తున్నారని చింతామోహన్ ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థ్ధితుల్లో 2019 లోపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అసాధ్యమని తేల్చేశారు. అయితే భవిష్యత్తులో ఎపికి ప్రత్యేక హోదా సాధ్యమేనని, కానీ ఎన్డీఏ హయాంలో మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని అన్నారు. రాని ప్రత్యేక హోదా గురించి ఎంపీలు రాజీనామాలు చేయడం దేనికని జగన్ ఎంపీల రాజీనామా నిర్ణయాన్ని తప్పుబట్టారు. చివరకు రాజీనామాల వల్ల నవ్వులపాలు కావడం తప్ప జరిగేది ఒరిగేదీ ఏమీ ఉండదని విమర్శించారు.
ఇద్దరూ...దోచుకొని...అభివృద్ది గురించి మాటలా?
నిరుపేద...సామాన్య కుటుంబం నుంచి వచ్చి 1978లో ఎమ్మెల్యే అయిన చంద్రబాబు నాయుడు వద్ద అప్పట్లో కనీసం వెయ్యి రూపాయలు కూడా లేవని...మరి ఇప్పుడు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని చింతామోహన్ ప్రశ్నించారు. అలాగే వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా కాకముందు...ఆ తరువాత జగన్ ప్రస్తుత ఆస్తులకు ఎంతో తేడా ఉందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఉండి కోట్ల రూపాయలు దండుకున్న వీరు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చింతామోహన్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి పేరుతో తిరుపతి పుణ్యక్షేత్రంలో 150 ఎకరాల భూమిని ముఖేష్ అంబానీకి ఇవ్వడం సమంజసం కాదని చింతామోహన్ ధ్వజమెత్తారు.