జగన్ పార్టీ నేత.. మా పెద్దన్న: మేకపాటిపై జేసీ కామెంట్, భుజంపై చెయ్యేసి మరీ!
పనులు త్వరితగతిన చేయాలన్న తపన అధికారుల్లో తనకు కనిపించిందని, కానీ అన్ని పనులు చేయలేకపోతున్నారని జేసీ అన్నారు.
విజయవాడ: దక్షిణ మధ్య రైల్వే బోర్డు అధికారులతో సమావేశానంతరం ఏపీ ఎంపీలు వెలిబుచ్చిన అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న తరహాలో ఎంపీ రాయపాటి వ్యాఖ్యలు చేయగా.. మరో ఎంపీ జేసీ మాత్రం అధికారులు ఏదో చేయాలని తపిస్తున్నారన్నారు.
పనులు త్వరితగతిన చేయాలన్న తపన అధికారుల్లో తనకు కనిపించిందని, కానీ అన్ని పనులు చేయలేకపోతున్నారని జేసీ అన్నారు. ధర్మవరం నుంచి విజయవాడకు కొత్త రైళ్లు వేయాల్సిందిగా కోరామని తెలిపారు.
మాట్లాడితే చంద్రబాబుకు కోపం, చెప్పుతో కొడతారు: ఊగిపోయిన రాయపాటి
అదే సమయంలో పక్కనే ఉన్న వైసీపీ ఎంపీ మేకపాటిని ఉద్దేశించి జేసీ సరదా వ్యాఖ్యలు చేశారు. మేకపాటిని పెద్దన్న అని సంబోధిస్తూ ఆయన భుజంపై చెయ్యి వేశారు. ఆపై 'ఏమీ ఎట్లాంటోడు ఈయన, జగన్ పార్టీకి చెందిన నేత' అని నవ్వుతూ మైక్ మేకపాటికి అందించారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ రైల్వే అధికారులకు తమ డిమాండ్ల గురించి వివరించినట్లు తెలిపారు.
అయితే పనుల విషయంలో అధికారులు చెబుతున్న సమాధానాలు దాటవేసే ధోరణితోనే ఉన్నాయని మేకపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి చూస్తాం, చేస్తాం, కుదరకపోవచ్చు.. వంటి నిర్లక్ష్యపు సమాధానాలే వచ్చినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే లేవనెత్తిన అన్ని అంశాలపై తక్షణం స్పందించాల్సిందిగా కోరినట్లు పేర్కొన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.