ఈ మధ్యే బస్సు కొన్నాం, కేశినేని నానితో మాట్లాడా: జేసీ దివాకర్ రెడ్డి
కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై అనంతపురం ఎంపీ, టిడిపి నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
అనంతపురం: కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై అనంతపురం ఎంపీ, టిడిపి నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
అయిదు నెలల కిందటే తాము బస్సును కొన్నామని చెప్పారు. బస్సుకు గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జీపీఎస్) ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్సు చేయించామనీ, బస్సుకు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.
'గో బ్యాక్ జగన్': చేదు అనుభవం, జగన్ ఉన్న గదికి దూసుకెళ్లారు
ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుందామనుకున్నా బస్సు డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చునని అన్నారు.
ముళ్లపాడు వద్ద కల్వర్టు కట్టలేదనీ, డివైడర్ మాత్రమే ఉండటంతో బస్సు కాలువలోకి పడి ప్రయాణికులు చనిపోయారని తెలిపారు. స్థానిక ఎంపీలు కేశినేని నాని, ఎమ్మెల్యేలతో మాట్లాడామని తెలిపారు. తమ మనుషులను పంపామనీ, అంతా తామే చూసుకుంటామని చెప్పారన్నారు.
డ్రైవర్ పైన కేసు నమోదు
బస్సులో ప్రయాణిస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసి చింతాడ రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. డ్రైవర్ మృతి చెందినందున బస్సు యజమాని దివాకర్ ట్రావెల్స్పై దర్యాప్తు చేపడతామన్నారు.
రఘువీరా దిగ్భ్రాంతి
బస్సు ప్రమాదం పైన ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు.
ప్రమాదం
భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి..
మరోవైపు, నందిగామ ఏరియా ఆసుపత్రిని వైసిపి అధినేత జగన్ సందర్శించారు. మార్చురీ గదిలో మృతదేహాలను పరిశీలించేందుకు లోపలికి వెళ్లిన జగన్ అక్కడే ఉన్న వైద్యులను పోస్టుమార్టం నివేదికలివ్వాలని అడిగారు. వాటిని పరిశీలించాక తిరిగి ఇవ్వాలంటూ వైద్యులు కోరగా జగన్ నిరాకరించారు. దీంతో వారితో వాగ్వాదం జరిగింది. జగన్ రాకను నిరసిస్తూ టీడీపీ నేతలు గో బ్యాక్ జగన్ అని నినదించారు. వైసిపి కూడా పెద్ద ఎత్తున టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది.