కొ** పదం తప్పా?...ఆ సిఐ నా చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో?:జెసి, ప్రబోధానందని బహిష్కరించాలి:మత పెద్దలు
అనంతపురం:ఎంపి జెసి వర్సెస్ స్వామి ప్రబోధానాంద వివాదం మంటలు చల్లారడం లేదు...జెసి వ్యాఖ్యలపై పోలీసు అధికారులు తీవ్రంగా ప్రతిస్పందించి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఎంపి జెసి మరోసారి మీడియా ముందుకు వచ్చారు.
"కొజ్జా పదం తప్పా?"...అని మీడియాను ఎదురు ప్రశ్నించిన ఎంపి జెసి...ఆ పదం తప్పని మీడియా చెబితే క్షమాపణ చెప్పడానికైనా...పోలీసుల కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీసం మెలేసిన సిఐని ఉద్దేశించి ఎక్కడకు రావాలో చెప్పమని సవాలు విసిరారు. మరోవైపు మత విద్వేషాలు రెచ్చగొడుతున్న స్వామి ప్రబోధానందను దేశం నుంచి బహిష్కరించాలని హిందూ, ముస్లిం, క్రిష్టియన్ మతాల పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించిన అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కొజ్జా అనే పదం తప్పని మీడియా చెబితే క్షమాపణ చెప్పడానికైనా...పోలీసుల కాళ్లు పట్టుకొని పాదాభివందనం చేసేందుకు సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంలో సిఐ గోరంట్ల మాధవ్ సవాలు గురించి మీడియా ప్రస్తావించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జెసి...మాధవ్ తన చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేశారో...నాకు తెలియదు...సాయికుమార్ సినిమాలో కూడ మీసాలు తిప్పుతారని చెప్పారు. మాధవ్ నన్ను బెదిరించే పెద్ద మనిషా...సాయి కుమార్ అనుకొంటున్నావా...ఇది సినిమా అనుకొంటున్నావా అంటూ మాధవ్ పై దుమ్మెత్తిపోశారు. ఈ జెంటిల్మెన్ పై కేసు దాఖలు చేస్తామని ఆయన చెప్పారు
నీవు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా...నీ పోలీస్ స్టేషన్ కు రావాలా...నీవు పుట్టిన గ్రామానికి రావాలా...అని సిఐ మాధవ్ కు ప్రతి సవాల్ విసిరారు. నీవు ఖాకీ బట్టలు విడిచి రా...నేను కూడ సాధారణ బట్టలు వదిలివస్తానని జేసీ దివాకర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. నీది నిజమైన మీసమైతే చెప్పాలన్నారు. నా నాలుక కోసేస్తే...నా చిన్న నాలుకను కూడ తెగ కోసేయించుకొంటానని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 25వ తేదీ వరకు ఇక్కడే ఉంటా...కత్తి పదునుగా లేకపోతే...పదును పెట్టుకోవాలంటూ సిఐ మాధవ్ నుద్దేశించి జేసీ వ్యాఖ్యానించారు.
మరోవైపు తన ప్రసంగాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభోదానందస్వామిని దేశం నుంచి బహిష్కరించాలని హిందూ, ముస్లిం, క్రిష్టియన్ మతాల పెద్దలు ఎపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రబోధానంద వ్యాఖ్యానించటం దుర్మార్గమని...భగవద్గీతను దూషించటం, రావణుడిని భగవంతుడిగా అభివర్ణించటం సరికాదని అన్నారు.
ప్రబోధానంద ఆశ్రమంపై ప్రభుత్వం విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆలూరు లక్ష్మీనరసింహశాస్ర్తి, చంద్రకాంత్ రావు, మారుతీనరసింహులు, జాన్వెస్లీ, నబీరసూల్, శ్రీనివాసులు, బాలాజీ, సత్యవాణి, రవిప్రకాష్, అయ్యంగార్, జావీర్ హుస్సేన్, బషీర్, ఖాజా, ఇబ్రహీం పాల్గొన్నారు.