తాజ్ మహల్ కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే...? అంటూ కేశినేని నానీ షాకింగ్ పోస్ట్
ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ఫేస్ బుక్ వేదికగా సంచలనాలకు తెర తీసిన కేశినేని నాని మొన్నటి వరకు టీడీపీలో ఉంటారా లేకా అయన కూడా జంప్ అవుతారా అన్న చందంగా వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు వైసీపీపై ఆయన సెటైర్లు వేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
వైసీపీ ఆ విషయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
ప్రజావేదికకు తాజ్ మహల్ కు ముడి పెట్టి మాట్లాడిన కేశినేని నానీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు అధికారులు ప్రజావేదిక కూల్చివేత పూర్తి చేశారు . అయితే, ప్రజా వేదిక అక్రమ కట్టడమని ఓవైపు సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తే... మరోవైపు అది అక్రమ కట్టడం కాదని వాదిస్తున్నారు టీడీపీ నేతలు. ఇక ఇది అక్రమక కట్టడమా? సక్రమ కట్టడమా ? అనే విషయం పక్కన బెడితే ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను హడావిడిగా కూల్చాల్సిన అవసరం లేదని కొందరు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు . ఇక ప్రజా వేదిక కూల్చివేతపై సోషల్ మీడియాతో వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.ప్రజావేదికకు తాజ్ మహల్ కు ముడి పెట్టి మాట్లాడారు .
ఆగ్రాలో ఉండబట్టి సరిపోయింది ..తాజ్ మహల్ కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే అంటూ పోస్ట్ చేసిన నానీ
ఇక ఆయన చేసిన పోస్ట్ లో " ఇంకా నయం... తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే........ '' అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని అర్ధం కృష్ణా నది తీరాన ఉంటే తాజ్ మహల్ను కూడా సీఎం జగన్ విడిచిపెట్టేవారు కాదు అనే కోణంలో సోషల్ మీడియాలో సెటైర్లు చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఇప్పుడు కేశినేని నానీ పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చారిత్రక కట్టడానికి , ప్రజా వేదికకు పోలికేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ అక్రమ నిర్మాణాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారా అని కొందరు నిలదీస్తున్నారు.
ప్రజావేదిక కంటే ముందు మిగతా అక్రమ కట్టడాలు తొలగించాల్సింది అన్న నానీ
నిన్నటి దాకా సొంత పార్టీ మీదనే తిరుగు బాటు బావుటా ఎగరేసిన కేశినేని నానీ తాజాగా ఏపీలోని పరిణామాలపై ,ప్రజావేదిక విషయంలో తన అభిప్రాయాలను ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. నిన్నటికి నిన్న ఆయన ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ లో ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే అది ప్రజాధనంతో నిర్మించిన వేదిక. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన తర్వాత.. ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుందని నిన్నటికి నిన్న తన అభిప్రాయం వ్యక్తం చేశారు కేశినేని నానీ . ఇప్పుడు తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలా నష్టం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజావేదికను ప్రజాధనంతో నిర్మించారు కాబట్టి ఆ సొమ్ము వృథా అవుతుందని ఆయన తన అభిప్రాయంగా చెప్పారు . మరో వేదిక కట్టే వరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈ లోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ఈ ప్రజావేదిక తొలగిస్తే బావుంటుందని నాని అభిప్రాయపడ్డారు.