ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు: కేశినేని నాని, 'పవన్ రాకపోవడం దురదృష్టకరం'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై కేశినేని నాని శుక్రవారం నిప్పులు చెరిగారు. కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాలూచీ పడుతోందని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా కోసం తాము రాజీనామా చేస్తున్నామని, టీడీపీ వారు కూడా కలిసి రావాలని వైసీపీ నేతలు చెప్పడం పైనా కేశినేని నాని స్పందించారు. ఎంపీలంతా రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేమీ లేదని చెప్పారు.
ఢిల్లీ వేదికగా ఏపీ ప్రజలు గళాన్ని వినిపించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని చెబుతూనే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని చెప్పారు. ఏప్రిల్ 2, 3వ తేదీల్లో చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని, కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన పార్టీ నేతలతో ఆయన భేటీ అవుతారని తెలిపారు.
చంద్రబాబు ఓపికను పరిశీలిస్తున్నారు: రామ్మోహన్
కేంద్రం తమపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓపికను పరిశీలిస్తోందని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ మండిపడ్డారు. టీడీపీ ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతోందని చెప్పారు.
నేనొస్తున్నా!: రంగంలోకి రామ్ మాధవ్, బాబుకు చెక్ పెట్టేనా? నేరుగా అధికారంలోకి రాకున్నా...
విభజన చట్టంలోని 19 అంశాలు నెరవేర్చాల్సిందేనని చెప్పారు. చివరి బడ్జెట్ వరకు ప్రజలు సహనంతో వేచి చూశారన్నారు. అయినా ఏపీకి కేంద్రం అన్యాయమే చేసిందన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు.
అఖిల పక్ష సమావేశానికి వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, పవన్ కళ్యాణ్ రాకపోవడం సరికాదని, దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే వారికి ముఖ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూసీలు పంపలేదని బీజేపీ నేతలు అబద్దాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోపల మోడీ కాళ్లు మొక్కుతూ, బయట అవిశ్వాసం అంటున్నారని వైసీపీపై మండిపడ్డారు. అసెంబ్లీకి రాని జగన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కంభంపాటి రామ్మోహన్ డిమాండ్ చేశారు.