'కేశినేని పెద్ద దొంగ.. ఆయనే లేకపోతే మమ్మల్ని బతకనిచ్చేవారు కాదు"
తానే గొప్పవాడినన్న తరహాలో కేశినేని విర్రవీగుతున్నారని సునీల్ రెడ్డి విమర్శించారు. తమ సంస్థకు చెందిన బస్సులన్నింటిని అన్ని రకాల అనుమతులతో నడుపుతున్నందువల్లే కేశినేని తమను టార్గెట్ చేశారని అన్నారు.
హైదరాబాద్: రవాణా శాఖ కమిషనర్తో దురుసుగా ప్రవర్తించి అధినేత చంద్రబాబు ఆగ్రహానికి గురైన టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమాలపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కేశినేని నాని వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడ్డారు.
రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి అధికారి అని, ఆయనే లేకపోతే తాము బస్సులు నడపుకునే పరిస్థితి లేదని సునీల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటివాళ్లు లేకపోతే కేశినేని నాని తమను బతకనిచ్చేవారు కాదని అన్నారు. ఎంపీ కేశినేనిని పెద్ద దొంగగా అభివర్ణించిన సునీల్ రెడ్డి.. ఆయన రూ.9కోట్లు సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు.
తలనొప్పేంటి, అంతా తెలుసు, సారీ చెప్పండి: బాబు ఆగ్రహం, ముందే రిపోర్ట్..
ఎంపీ కేశినేని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సునీల్ రెడ్డి ఈ సందర్బంగా ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైనాన్స్ వ్యాపారులను బెదిరిస్తున్నారని, తన సంస్థకు చెందిన మూడు బస్సులపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. బస్సు ప్రమాదం కేసులో పోలీసుల మీద కూడా నాని ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. నివేదికలు మార్చాలని అధికారులను కేశినేని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు.
తామంతా కలిసి కేశినేనిని ఎంపీగా గెలిపించినా.. ఆయన మాత్రం తమ మీద కక్ష పెంచుకున్నాడని, గత ఆరు నెలలుగా ఆయన వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. నాని కారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని ఇబ్బందులకు గురవతున్నాయన్నారు. కేశినేని లాంటి అహంకారులు ఎంపీలుగా ఉండటం విజయవాడ ప్రజల దురదృష్టమన్నారు.
తానే గొప్పవాడినన్న తరహాలో కేశినేని విర్రవీగుతున్నారని సునీల్ రెడ్డి విమర్శించారు. తమ సంస్థకు చెందిన బస్సులన్నింటిని అన్ని రకాల అనుమతులతో నడుపుతున్నందువల్లే కేశినేని తమను టార్గెట్ చేశారని అన్నారు.