తొడలు కొడితే నేతలు కాలేరు - సొంత పార్టీ నేతలపై కేశినేని ఫైర్..!!
విజయవాడ కేంద్రంగా టీడీపీ నేతల కోల్డ్ వార్ మరోసారి తెర మీదకు వచ్చింది. ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి సభలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కోసం ఎవరైతే నిస్వార్దంగా పని చేస్తారో వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని చెప్పారు. మీడియా నుంచి ప్రజల నుంచే మంచి నాయకులు పార్టీ కోసం మందుకొస్తారంటూ కేశినేని వ్యాఖ్యలు చేసారు. ఎక్కడో తొడలు కొట్టిన వారు ఇక్కడ నాయకులు కాలేంరంటూ ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు.
జిల్లా పార్టీ సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా తొడకొట్టి మాజీ మంత్రి కొడాలి నానిని ఓడిస్తామనంటూ సవాల్ చేసారు. ఇప్పుడు ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు మాజీ మంత్రి దేవినేనిపైన చేసినవేనంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ వీరిద్దరి మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎంపీ కేశినేని సమావేశానికి దూరంగా ఉన్నారు. కమర్షియల్ నేతలను అంగీకరించే ప్రసక్తే లేదని ఎంపీ స్పష్టం చేసారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో పార్టీలోని నేతలంతా కలిసి పని చేయాలని సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ నిర్ణయం జరిగినా అందరి అంగీకారం మేరకే జరిగిందని చెప్పారు.
సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఎన్న మాటలు చెప్పినా మరోసారి ప్రజలు నమ్మటానికి, మోసపోవటానికి సిద్దంగా లేరన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వ్యక్తిని చూసి ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో తనకు ఇదే నియోజకవర్గంలో మెజార్టీ వచ్చిందని, పార్టీ అభ్యర్ధి ఓడిపోయారని ఎంపీ నాని గుర్తు చేసారు. విజయవాడకు తాను లేకపోతే ఏదీ లేనట్లుగా సీఎం జగన్ మాట్లాడుతున్నారని, టీడీపీ హయాంలోనే నగరానికి మూడు ఫ్లై ఓవర్లు వచ్చాయని గుర్తు చేసారు. రాష్ట్రం మధ్యన అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధాని ఖరారు చేసారని, అక్కడ ఉంటేనే అందరికీ ఉపయోగమని కేశినేని నాని చెప్పుకొచ్చారు.